టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు చాలా అత్యాశే ఉంది. దాన్ని బయట పెట్టడానికి ఆయన ఏ మాత్రం సంకోచించడం లేదు. లోకేశ్లోని ఆ ధైర్యాన్ని తప్పక అభినందించాలి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాయికి తనను తాను ఊహించుకుంటూ … ట్విటర్ లోకంలో లోకేశుడు విహరిస్తున్నారు. పిండికొద్ది రొట్టె, ప్రజల్లో పలుకుబడిని బట్టి పదవులు అనే స్పృహ మాత్రం ఆయనలో లేకపోవడం గమనార్హం. అందుకే ఆయన ఆలోచనలు, ఆశలు నేలవిడిచి సాము చేస్తుంటాయి.
తాను జగన్రెడ్డికి సవాల్ చేస్తే విజయసాయిరెడ్డి స్పందించడం ఏంటి? అని లోకేశ్ ప్రశ్నిస్తున్నారు. తనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసలు పట్టించుకోలేదనే బాధ, అక్కసు స్పష్టంగా లోకేశ్ మాటల్లో కనిపిస్తున్నాయి.
జగన్కు ముందూ వెనుకా ఓ హోదా, స్థాయి ఉన్నాయనే విషయాన్ని మరిచి, అహంకారంతో ఏకవచనంతో సంబోధిస్తూ ….స్పందించాలని లోకేశ్ డిమాండ్ చేయడం ద్వారా తనస్థాయి ఏంటో తానే నిరూపించుకున్నారు.
“జగన్కు దమ్ము, ధైర్యం లేదా? నాపై జగన్రెడ్డి చేస్తున్న, చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవమని సింహాద్రి అప్పన్నపై ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. జగన్రెడ్డి సిద్ధమా? అని మరోసారి సవాల్ చేస్తున్నాను” అంటూ లోకేశ్ చేస్తున్న రోదన అరణ్య రోదనవుతోంది.
ముఖ్యమంత్రి తనయుడిగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మంగళగిరిలో మొట్టమొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి మూటకట్టుకున్న లోకేశ్కు ఇంకా జ్ఞానోదయం కాలేదు. తన సవాల్కు విజయసాయిరెడ్డి స్పందించడమే గొప్ప అని సరిపెట్టుకోవాల్సింది పోయి, ఇంకా అవాకులు చెవాకులు పేలడం ఏంటి?
ఏ రకంగా తాను జగన్ స్థాయి నేతనని లోకేశ్ ఊహిస్తున్నారో అర్థం కాదు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా ఎక్కడా కుంగిపోకుండా, లక్ష్యం వైపు నడిచిన ధీరుడు వైఎస్ జగన్. కానీ లోకేశ్ రాజకీయ ప్రవేశం ఒడ్డించిన విస్తరి.
నామినేటెడ్ పదవి ద్వారా మంత్రి పదవిని దక్కించుకున్న చరిత్ర లోకేశ్ది. అలాంటప్పుడు తన ట్వీట్లు, సవాళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించాలని లోకేశ్ డిమాండ్ చేయడం అత్యాశ కాక మరేంటి? అత్యాశకు కూడా ఓ హద్దు ఉండాలని లోకేశ్ గ్రహిస్తే మంచిది.