టీడీపీలో దమ్మున్న, ప్రజాభిమానం మెండుగా కలిగిన ఒకే ఒక్క నాయకుడిగా జేసీ ప్రభాకర్రెడ్డి నిరూపించుకున్నాడు. అధికార పార్టీ వైసీపీ నుంచి ఎన్ని ఇబ్బందులెదురైనా …దీటుగా ఎదుర్కొంటూ నిటారుగా నిలిచిన నేతగా జేసీ ప్రభాకర్రెడ్డి ఆ పార్టీ శ్రేణుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో 75 మున్సిపాల్టీల్లో తాడిపత్రి మినహా మిగిలిన 74 చోట్ల అధికార పార్టీ వైసీపీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అలాగే 11 కార్పొరేషన్లలో వైసీపీ తన సత్తా చాటింది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఎన్నికై తన పట్టు నిలుపుకున్నారు. వైస్ చైర్మన్గా సరస్వతిని ఎన్నుకున్నారు. తాడిపత్రి మున్సిపాల్టీలో 36 వార్డులకు గాను రెండు వార్డులను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 34 వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 18, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి చెరొక చోట గెలుపొందారు. దీంతో టీడీపీ బలం 20కి పెరిగింది.
ఇక అధికార పార్టీ వైసీపీ విషయానికి వస్తే 14 చోట్ల గెలుపొందింది. రెండు ఏకగ్రీవాలతో పాటు రెండు ఎక్స్ అఫీషియో ఓట్లతో కలుపుకుంటే మొత్తం 18 మంది సభ్యుల బలానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో తాడిపత్రి మున్సిపల్ ఎన్నిక ఉత్కంఠకు తెరలేపింది. దీంతో జేసీ ప్రభాకర్రెడ్డి నేతృత్వంలో టీడీపీ క్యాంప్ రాజకీయానికి తెరలేపింది.
ఈ రోజు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాడిపత్రిలో 600 మంది పోలీసు బలగాలతో నూతన పాలక మండలి ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. అలాగే ఎన్నిక సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా టీడీపీ మద్దతుదారులు, వైసీపీ సభ్యులు మధ్య కంచె ఏర్పాటు చేయడం గమనార్హం.
చివరికి టీడీపీ అంచనానే నిజమైంది. 20 మంది మద్దతుతో చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంది. దీంతో ఏపీలో టీడీపీ ఏలుబడిలోని ఏకైక మున్సిపాల్టీగా తాడిపత్రి చరిత్ర సృష్టించింది. అందుకే జేసీ ప్రభాకర్రెడ్డిని టీడీపీలో ఒకే ఒక్కడని అభివర్ణించడం.