ఒకరిద్దరికి ఇళ్ళు ఇస్తే కధ వేరు. వేలకు వేలమందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తూంటే అది ఇళ్ళ పంపిణీ కాదు, ఒక కొత్త ఊరునే నిర్మిస్తున్నట్లే అవుతుంది. ఏపీలో ఇపుడు అదే జరుగుతోంది.
ముఖ్యమంత్రి జగన్ సర్కార్ లక్షల్లో ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తోంది. దాంతో కొత్త ప్రాంతాలలో ఊళ్ళకు ఊళ్ళు వెలుస్తున్నాయి. కొత్త పంచాయతీలు ఏర్పాటు అవుతున్నాయి.
ఇదిలా ఉంటే విజయనగరం జిల్లాలోని గుంకలాం వద్ద 12 వేల మంది మంది లబ్దిదారుల కోసం 397 ఎకరాల్లో భారీ లే అవుట్ వేశారు. ఇక్కడ ప్రభుత్వం నాలుగున్నర కోట్లతో లే అవుట్ అభివృద్ధి చేసింది. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గానూ ప్రభుత్వం 102 కోట్లు ఖర్చు చేసింది.
ఇక్కడకు వచ్చి పట్టాలు పంపిణీ చేసిన జగన్ ఏకంగా కొత్త పంచాయతీనే ప్రారంభించేశారు. తాను ఇస్తున్నది ఇళ్ళు కానే కాదు ఊళ్ళు అని మరో మారు ముఖ్యమంత్రి గర్వంగా చాటారు.
గుంకలాం లో ఆసుపత్రి, పాఠశాల, విద్యుత్ సదుపాయాలు, ఆలయాలు, బస్టాండ్ ఇలా అన్నీ అభివృద్ధి చేస్తామని జగన్ చెప్పారు. ఇదిపుడు కొత్త పంచాయతీగా మారిపోయిందని ఆయన స్వయంగా ప్రకటించడం విశేషం.
మొత్తానికి వైసీపీ తలపెట్టిన ఇళ్ళ పట్టాల పంపిణీ ప్రగతి విషయంలో కొత్త విప్లవాన్నే సృష్టిస్తోంది అని చెప్పాలి.