తిరుపతి లోక్సబ్ ఉప ఎన్నిక విషయంలో గత రాత్రి జనసేన సంచలన తీర్మానం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. తిరుపతి లోక్సభ టికెట్ను జనసేన ఆశించిన సంగతి తెలిసిందే. అభ్యర్థి ఎంపికపై కమిటీ వేశామని, అది ఇచ్చే నివేదికను బట్టి ఏ పార్టీ బరిలో ఉండాలో తేలుతుందని బీజేపీ, జనసేన నేతలు చెబుతూ వచ్చారు. అయితే చివరికి తిరుపతి ఉప ఎన్నిక బరిలో బీజేపీనే ఉంటుందని పవన్కల్యాణ్తో పాటు బీజేపీ నేతలు ప్రకటించడం గమనార్హం.
ఈ ప్రకటనపై క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి తిరుపతిలో జనసేనకు చెందిన ముఖ్య నాయకుడి ఇంట్లో ఓ సామాజిక వర్గంతో పాటు పార్టీ కీలక నేతలు సమావేశమైనట్టు సమాచారం. ఈ సమావే శంలో తిరుపతి ఉప ఎన్నికలో అనుసరించే వైఖరిపై కీలక తీర్మానం చేసినట్టు తెలిసింది.
పొత్తు ధర్మం పాటించకుండా తమను అవమానిస్తున్న బీజేపీకి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో గట్టిగా బుద్ధి చెప్పాలని తీర్మానించినట్టు సమాచారం. ఇందులో భాగంగా బీజేపీకి కాకుండా నోటాకు ఓట్లు వేయాలని మెజార్టీ నేతలు అభిప్రాయపడినట్టు తెలిసింది. అలాగే మరికొందరు చంద్రబాబు అభిమానులు మాత్రం జనసేన కాదంటే టీడీపీకి వేస్తామని అన్నట్టు తెలిసింది. ఈ తీర్మానం వెనుక జనసేన పకడ్బందీ వ్యూహం ఉందని చెబుతున్నారు.
ఈ ఉప ఎన్నికలో తమ మద్దతు లేకపోతే బీజేపీ కనీసం నోటాకు మించి ఓట్లను సాధించలేదని జనసేన నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. జనసేన లేకపోతే బీజేపీ వాస్తవ బలం ఏంటో ఈ ఉప ఎన్నిక ద్వారా నిరూపించాలని ఆ పార్టీ నేతలు గట్టిగా నిర్ణయించుకున్నారని సమాచారం.
ఇటీవల చంద్రగిరిలో కాపు సామాజిక వర్గ నేతలు సమావేశమై జనసేనకు తిరుపతి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో నోటాకు ఓట్లు వేస్తామని తీర్మానం చేయడాన్ని ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలి.
మరోవైపు తమ నాయకుడు పవన్కల్యాణ్ మాత్రం ఎప్పట్లాగే బీజేపీకి అండగా నిలవాలనే పిలుపు ఇస్తూ ఉంటారని జనసేన నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా తమతో పొత్తు కుదుర్చుకుని అవమానిస్తున్నారని బీజేపీ నేతలపై జనసేన నాయకులు, కార్యకర్తలు రగులుతున్నారనేందుకు తిరుపతిలో చేసిన తీర్మానమే నిదర్శనమని చెప్పక తప్పదు.