కాదన్న కేంద్రం…కుద‌ర‌ద‌న్న సుప్రీంకోర్టు!

పెగాస‌స్ ఫోన్ల హ్యాకింగ్‌పై త‌గిన వివ‌రాల‌తో అద‌న‌పు అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను కేంద్రం పాటించ‌లేదు. పైగా గ‌తంలో ఇచ్చిన అఫిడ‌విట్ స‌రిపోతుంద‌ని, అంత‌కు మించి అవ‌స‌రం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం…

పెగాస‌స్ ఫోన్ల హ్యాకింగ్‌పై త‌గిన వివ‌రాల‌తో అద‌న‌పు అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను కేంద్రం పాటించ‌లేదు. పైగా గ‌తంలో ఇచ్చిన అఫిడ‌విట్ స‌రిపోతుంద‌ని, అంత‌కు మించి అవ‌స‌రం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానానికి తేల్చి చెప్పింది. కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇలాగైతే తామే రెండు మూడు రోజుల్లో త‌గిన ఆదేశాలు ఇస్తామ‌ని తీర్పును రిజ‌ర్వ్ చేసింది.ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టులో పెగాస‌స్‌పై విచార‌ణ‌లో భాగంగా సోమ‌వారం ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీలతో కూడిన ధర్మాసనం పెగాసస్‌పై విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్(ఎస్‌జీ) వాదనలు వినిపించారు. దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదన్న ఉద్దేశం తోనే ఈ వ్యవహారంలో తాము సవివరంగా అఫిడవిట్‌ దాఖలు చేయట్లేదని కేంద్రం న్యాయస్థానానికి తెలిపింది. అయితే, ఈ ఆరోపణలపై దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు  తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు.

సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ దేశ భద్రత, శాంతి భద్రతల అంశాల్లోకి తాము వెళ్లడం లేదన్నారు. జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, తదితరులు త‌మ‌ హక్కుల రక్షణకై దాఖలు చేసిన పిటిషన్లపై మాత్రమే విచారణ జరుపుతున్నామని తెలిపారు.

ప్రభుత్వం ఏమైనా స్పైవేర్‌ నిఘాను ఉపయోగించిందా? అని సీజేఐ ఎన్వీ రమణ నిల‌దీశారు. సొలిసిటర్ జనరల్ సమాధానం ఇస్తూ.. స్పైవేర్‌ అంశంపై లోక్‌సభలో ఐటీ మంత్రి వివరణ ఇచ్చారన్నారు. సీజేఐ జోక్యం చేసుకుంటూ పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తే ప్రభుత్వ ఉద్దేశం ఏంటో తెలుస్తుందన్నారు.  

అయితే ఇప్ప‌టికే స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ స‌రిపోతుంద‌ని, స‌మ‌గ్ర‌మైన అఫిడ‌విట్  స‌మ‌ర్పించాల్సిన అవ‌స‌రం లేద‌ని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతా స్ప‌ష్టం చేశారు.  దేశ భద్రతకు సంబంధించిన విషయాలను బహిరంగపర్చలేమని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింద‌న్నారు.

కేంద్రం సమాధానంపై ప్రధాన సీజేఐ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. పెగాసస్‌ అంశం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయమ‌న్నారు. పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో స్పష్టం చేస్తే చాల‌న్నారు. ఇందులో గోప్యతా హక్కుల ఉల్లంఘన ఆరోపణలకే పరిమితం కావాల‌న్నారు. దీనిపై ఒక ప్రకటన చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చామ‌న్నారు. 

అయిన‌ప్ప‌టికీ ప్రకటన చేయడానికి కేంద్రం ఇష్టపడట్లేదన్నారు. దీనిపై మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. రెండుమూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్వర్వులు జారీ చేస్తామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు.