తిరుపతిలో సినిమాను తలపించే సీన్… ఓ వ్యక్తి రోడ్డు వెంబడి పరుగు. జనానికి ఏమీ అర్థం కాని పరిస్థితి. ప్రియురాలితో కాపురం పెట్టిన ఓ వ్యక్తి …ఒక్కసారిగా భార్య రావడంతో కాళ్లకు పని చెప్పాడు. గోడ దూకి పరుగు పెట్టాడు. అంతా సినిమా సీన్ను కళ్లకు కట్టే ఈ ఘటన తిరుపతిలో శనివారం చోటు చేసుకొంది.
చిత్తూరులో చంద్రమౌళి అనే వ్యక్తి న్యాయవాది. ఆయన భార్య పేరు కవిత. సదరు వకీలు గారు తిరుపతి పద్మావతి నగర్లో ఇంటిని అద్దెకు తీసుకుని ప్రియురాలితో కాపురం పెట్టాడు.
గుట్టు చప్పుడు కాకుండా కొంత కాలంగా ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నాడు. అయితే భర్తపై కవితకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె నిఘా పెట్టింది. చంద్రమౌళి ప్రియురాలితో కలిసి పద్మావతినగర్ ఇంట్లో ఉండగా కవిత, ఆమె బంధువులు వెళ్లారు.
అకస్మాత్తుగా భార్య, బంధువులు రావడాన్ని చూసిన చంద్రమూళి ఇంటి వెనుక నుంచి గోడ దూకి రోడ్డుమీద పడ్డాడు. ఆ తర్వాత పరుగు పందెంలో పాల్గొన్న వ్యక్తి మాదిరిగా వెనక్కి తిరగ చూడకుండా ఒకటే పరుగు. అతను ఎందుకు పరుగు తీస్తున్నాడో అర్థం కాని జనం సినిమా చూసినట్టు కళ్లప్పగించి చూడసాగారు.
దీంతో బాధితురాలైన భార్య కవిత తనకు న్యాయం చేయాలంటూ అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టింది. అక్కడ జనం గుమిగూడి ఏం జరిగిందని ఆరా తీశారు.
కాల్ మనీ కేసులో గతంలో చంద్రమౌళి అరెస్టయ్యాడు. చాలామంది మహిళలకు డబ్బు ఆశ చూపి వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నట్టు సమాచారం. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.