భూవివాదం కేసులో తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై దుండిగల్ ఠాణాలో కేసు నమోదు కావడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు మంత్రిపై కేసు నమోదు కావడం గమనార్హం.
శ్యామలాదేవి అనే మహిళ న్యాయ పోరాటం ఎట్టకేలకు ఫలించి పోలీసులు అధికార పార్టీ నాయకుడు, అది కూడా మంత్రిపై కేసు నమోదు చేయాల్సి వచ్చింది. దీంతో శ్యామలాదేవి పేరు మీడియాలో మార్మోగిపోతోంది.
ఈ నేపథ్యంలో భూవివాదంలో చిక్కుకున్న మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భూమిని ఆక్రమించినట్టు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అసలు ఆ శ్యామలాదేవి ఎవరో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. తన భూమి పక్కనే ఆమె భూమి ఉందని తెలుస్తోందన్నారు.
ఆల్రెడీ తనకు చాలా భూమి ఉన్నట్టు ఆయన వివరించారు. ఒక మహిళకు మంత్రిగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. బాధిత మహిళైన శ్యామల ఇంత వరకూ తననూ ఎప్పుడూ కలవలేదన్నారు. అలాంటప్పుడు ఆమెను బెదిరించడం అనే ప్రశ్న తలెత్తదని మల్లారెడ్డి చెప్పారు.
శ్యామలాదేవి తల్లి పొన్నబోయిన పద్మావతి పేరుపై సూరారంలో సర్వే నంబర్ 115, 116, 117లలో 2.13 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి పక్కనే మంత్రి మల్లారెడ్డికి భూమి ఉన్నట్టు తెలుస్తోంది. ఆ 2.13 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కునేందుకు మంత్రి మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారనేది శ్యామలాదేవి ఆరోపణ. మంత్రితో పాటు ఆయన కుమారుడు, వారి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దీంతో న్యాయస్థానం విచారించి మంత్రితో పాటు ఆయన కుమారుడిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు వారిపై కేసు ఫైల్ చేశారు. భూఆక్రమణ వ్యవహారం వెలుగులోకి రావడంతో మీడియాలో రచ్చరచ్చ అవుతోంది. దీంతో మల్లారెడ్డి మీడియా ముందుకొచ్చి తనకు శ్యామలాదేవి ఎవరో తెలియదని, నమ్మాలని వేడుకోవడం గమనార్హం.