సహజీవనం చేశాడు.. అమ్మ వద్దందని వదిలేశాడు

ప్రేమించినప్పుడు అమ్మ గుర్తురాలేదు. దొంగచాటుగా పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అమ్మ గుర్తురాలేదు. ఓ నెల పాటు సుఖంగా “కాపురం” చేసినప్పుడు సైతం అమ్మ గుర్తుకురాలేదు. భార్యను ఇంటికి తీసుకెళ్లాల్సినప్పుడు మాత్రం అమ్మ గుర్తొచ్చింది. అమ్మ…

ప్రేమించినప్పుడు అమ్మ గుర్తురాలేదు. దొంగచాటుగా పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అమ్మ గుర్తురాలేదు. ఓ నెల పాటు సుఖంగా “కాపురం” చేసినప్పుడు సైతం అమ్మ గుర్తుకురాలేదు. భార్యను ఇంటికి తీసుకెళ్లాల్సినప్పుడు మాత్రం అమ్మ గుర్తొచ్చింది. అమ్మ అంగీకరించడం లేదంటూ భార్యను వదిలి వచ్చేశాడు ఓ దుర్మార్గుడు. బాగా చూసుకుంటాడనుకున్న భర్త హ్యాండ్ ఇవ్వడంతో ఆ యువతి షాక్ అయింది.

సిద్ధిపేటకు చెందిన వెంకటరమణారెడ్డి, రాణి నాలుగేళ్లు ప్రేమించుకున్నారు. ఒక మంచి రోజు చూసి ఇంట్లో చెప్పాపెట్టకుండా యాదగిరిగుట్టకు వెళ్లి పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంటికి తీసుకెళ్దామంటే అమ్మ ఒప్పుకోవడం లేదని, కొన్నాళ్లు వేరు కాపురం పెడదామంటూ రాణిని హైదరాబాద్ తీసుకెళ్లాడు. కొన్నాళ్ల పాటు హైదరాబాద్ లో కాపురం చేశారు.

ఓ నెల రోజులు గడిచాయి. రమణారెడ్డిపై, రాణిపై మోజు తగ్గింది. ఓ రోజు తన బండిపై రాణిని తీసుకెళ్లి, వాళ్ల అమ్మమ్మ ఇంట్లో విడిచిపెట్టాడు. అక్కడే ఉండాలని, అమ్మని ఒప్పించి వస్తానని చెప్పి వెళ్లాడు. అంతే.. ఇక కనిపించలేదు.

భర్త హ్యాండిచ్చాడని తెలుసుకున్న రాణి నేరుగా అతడి ఇంటికే వెళ్లింది. కానీ రమణారెడ్డి అమ్మ, రాణిని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో తన భర్త ఇంటి ముందే ధర్నాకు దిగింది రాణి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో గమ్మత్తైన విషయం ఏంటంటే.. భర్త ఇంట్లోనే ఉన్నాడని రాణి చెబుతోంది. తన కొడుకు ఎక్కడున్నాడో తనకు తెలియదని రమణారెడ్డి తల్లి చెబుతోంది.

టీటీడీలో 140 మందికి పాజిటివ్

బాలినేని మీద బురద చల్లొద్దు