ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన కౌంటింగ్ కు రాత్రి ఎనిమిది గంటలు తుదిగడువు. ఆ లోపు కౌంటింగ్ పూర్తి కావాలని ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చారు. బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ కావడంతో సహజంగానే ఫలితాలు ఆలస్యం అవుతున్నాయి. రాత్రి ఎనిమిది గంటలకు తుది గడువు అయినా, ఆలోపే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.
ఇప్పటికే అనేక వార్డులకు సంబంధించి ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. వాటి ప్రకారం వివిధ మున్సిపాలిటీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా గట్టిగానే వీస్తోంది. ఏకగ్రీవాలతోనే వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పాతింది. తొలి తొలి ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత స్పష్టం అవుతోంది.
తెలుగుదేశం ముఖ్య నేత యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం లోని తుని మున్సిపాలిటీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి ఫలితాల్లోనే 15 వార్డులను సొంతం చేసుకోవడం గమనార్హం.
అలాగే పోటాపోటీ పరిస్థితి అనుకున్న ధర్మవరంలో కూడా పది వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా సాగుతూ ఉంది.
ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఇలా వివిధ మున్సిపాలిటీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా సాగుతూ ఉంది.