రండి రండి ద‌య చేయండి…

విచార‌ణ‌కు రండి రండి అంటూ టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌కేట్ (ఈడీ) స‌మ‌న్లు జారీ చేసింది. బ్యాంకు రుణాల మ‌ళ్లింపు వ్య‌వ‌హారంలో ఇటీవ‌ల నామా నాగేశ్వ‌ర‌రావు, ఆయ‌న కంపెనీ మ‌ధుకాన్ సంస్థ‌కు…

విచార‌ణ‌కు రండి రండి అంటూ టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌కేట్ (ఈడీ) స‌మ‌న్లు జారీ చేసింది. బ్యాంకు రుణాల మ‌ళ్లింపు వ్య‌వ‌హారంలో ఇటీవ‌ల నామా నాగేశ్వ‌ర‌రావు, ఆయ‌న కంపెనీ మ‌ధుకాన్ సంస్థ‌కు చెందిన డైరెక్ట‌ర్ల‌ ఇళ్లు, కార్యాల‌యాల్లో ఈడీ సోదాలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. 

నామాతో పాటు మ‌ధుకాన్ కంపెనీ డైరెక్ట‌ర్ల‌కు కూడా తాజాగా ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. జాతీయ రహదారి నిర్మాణం కోసం రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇతర అవసరాల కోసం మళ్లించినట్టు మధుకాన్‌ గ్రూప్‌పై ఈడీ అభియోగం దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. 

ఇందుకు సంబంధించి సోదాల్లో కీల‌క ద‌స్త్రాలు స్వాధీనం చేసుకున్న‌ట్టు స‌మాచారం. వాటి ఆధారంగ‌నే విచార‌ణ చేప‌ట్టేందుకు ఈడీ నిర్ణ‌యించింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ నెల 25న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల ఈడీ సోదాల్లో ద‌స్త్రాల‌తో పాటు భారీగా న‌గ‌దును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  

దస్త్రాలు, బ్యాంకు ఖాతాలు, హార్డ్ డిస్కుల‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌కేట్ అధికారులు విశ్లేషిస్తున్నారు. విచార‌ణ లోపు నామాతో పాటు ఆయ‌న కంపెనీ అవ‌క‌త‌వ‌క‌ల‌పై మ‌రిన్ని అధారాలు సేక‌రించే ప‌నిలో ఈడీ నిమ‌గ్న‌మైంది. మున్ముందు ఈ కేసు ఏ మ‌లుపు తీసుకుంటుందో చూడాలి.