కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అలా అయిపోయాయో లేదో.. ఇంతలోనే వేరే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కమలం పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. కర్ణాటకలో ఎదురుదెబ్బ గట్టిగానే తగిలినా.. మోడీ అండ్ కో ఇప్పుడు త్వరలో ఎన్నికలు జరగనున్న వివిధ రాష్ట్రాల విషయంలో కార్యాచరణ మొదలుపెట్టేసిందప్పుడే! ఈ సారి వంతులో తెలంగాణతో సహా పలు రాష్ట్రాలున్నాయి.
తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం లలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలన్నీ తమకు ప్రతిష్టాత్మకం కావడంతో బీజేపీ అధిష్టానం వీటికి ప్రిపరేషన్ ను మొదలుపెట్టింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ కనివినీ ఎరగని స్థాయిలో కష్టపడింది. ప్రచారపర్వాన్ని ఒక రేంజ్ లో చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దాదాపు నెల రోజుల పై వ్యవధినే కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వినియోగించారు. రోడ్ షోలు, ర్యాలీలు, ఎన్నికల ప్రచార సభలతో హోరెత్తించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయంటే.. ఆ రాష్ట్రం మీదే మోడీ కాన్సన్ ట్రేషన్ విపరీత స్థాయిలో ఉండటం ఆనవాయతీ. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల చుట్టూ తిరగడం, ఆ రాష్ట్రాలకు ప్రత్యేక వరాలు ప్రకటించడం.. ఇవన్నీ రొటీనే. కేవలం మోడీ మాత్రమే కాకుండా.. అమిత్ షా కూడా ఈ ఎన్నికల రాష్ట్రాల పనుల్లోనే నిమగ్నం అవుతూ ఉంటారు.
మరి ఇలాంటి క్రమంలో.. ఇప్పుడు బీజేపీకి ప్రతిష్టాత్మకమైన రాష్ట్రాల ఎన్నికలు త్వరలోనే జరగాల్సి ఉంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరిగే అవకాశం ఉంది. నవంబర్ లో మధ్యప్రదేశ్ ఎన్నికలు ఉండవచ్చు. రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరం రాష్ట్రాల ఎన్నికలు కూడా అప్పుడే ఉంటాయి. వీటితో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఒకే సారి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.
మరి ఈ రాష్ట్రాలన్నీ బీజేపీకి ఏదో రకంగా ప్రతిష్టాత్మకమే, రాజస్తాన్ లో ప్రతి ఐదేళ్లకూ అధికారం చేతులు మారుతూ ఉంటుంది, కాంగ్రెస్ నుంచి ఈ సారి బీజేపీ దాన్ని సాధించుకోవాలి. ఇక మధ్యప్రదేశ్ లో ఫిరాయింపుదారులతో కలిపి తాము ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి మద్దతెంతో కమలం తేల్చుకోవాల్సి ఉంది, ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ తో పోరాడుతోంది బీజేపీ.
ఇక తెలంగాణలో కేసీఆర్ కు చెక్ పెట్టడంతో పాటు, కాంగ్రెస్ ను కూడా గల్లంతు చేసి తను అధికారాన్ని చేపట్టాలని బీజేపీ ఉబలాటపడుతూ ఉంది. మరి ఒక రేంజ్ లో కష్టపడినా కర్ణాటకలో పరువు నిలుపుకోలేకపోయిన బీజేపీ ఈ రాష్ట్రాల ఎన్నికలకు ఇంకా ఏ స్థాయిలో కష్టపడుతుందనేది ఈ ఎన్నికలయ్యేంత వరకూ ఇక ప్రతి రోజూ వెల్లడి కానుంది!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు