విష్ణుదేవుడు ముస్లిం మహిళను ఎందుకు ఎంచుకున్నాడో?

ఒకసారి సెలబ్రిటీ అయిపోయిన తర్వాత.. దేవుడికి కూడా ఆ సెలబ్రిటీ హోదా కనిపిస్తుందే తప్ప.. ఇతర విషయాలు పట్టవు లాగుంది. దేవుడే స్వయంగా ఎంచుకుంటాడని (?) చెప్పే ఓ పూజా కార్యక్రమానికి అసలు ఆ…

ఒకసారి సెలబ్రిటీ అయిపోయిన తర్వాత.. దేవుడికి కూడా ఆ సెలబ్రిటీ హోదా కనిపిస్తుందే తప్ప.. ఇతర విషయాలు పట్టవు లాగుంది. దేవుడే స్వయంగా ఎంచుకుంటాడని (?) చెప్పే ఓ పూజా కార్యక్రమానికి అసలు ఆ దేవుడిని పూజించే మతానికి సంబంధం లేని వారిని ఎంచుకుంటే ఏమని అనగలం.. ఆశ్చర్యపోవడం తప్ప! ఇప్పుడు తమిళనాడులోని ఒక ప్రాచీన ఆలయంలో.. నటి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఖుష్బూకు ప్రత్యేకంగా పూజలు చేయడం ఇలాంటి ఆశ్చర్యాన్నే కలిగిస్తున్నది.

శతాబ్దాల కిందటి అనేకానేక ప్రాచీన ఆలయాలకు పేరుమోసిన తమిళనాడులో త్రిసూర్ లో విష్ణుమాయ అనే ఒక ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో ఏడాదికి ఒకసారి ప్రత్యేకంగా నారీ పూజ నిర్వహిస్తారు. ఒక మహిళను సాక్షాత్తూ ఆలయంలోని విష్ణుమూర్తే ఎంచుకుంటారని ప్రతీతి! 

దేవుడు ఎంచుకునే విధానం ఏమిటో మనకు తెలియదు గానీ.. అలా ఎంచుకున్న మహిళకు నారీపూజ నిర్వహిస్తారు. అంటే ఆమెను సింహాసనం వంటి ఒక ఆసనంపై కూర్చుండబెట్టి ఆలయ పూజారులు పూజాదికాలు ఆమెకు నిర్వహిస్తారు. అలా నారీపూజ నిర్వహించిన తర్వాత, ఆ మహిళ సదరు విష్ణుమాయ ఆలయానికి ఒక ఏడాది పాటు ‘కమాండర్’గా ఉంటారు. ఇలా ప్రతి ఏడాది జరుగుతుంది. ఈ ఏడాది త్రిసూర్ లోని విష్ణుమాయ ఆలయంలో నారీపూజను ఖుష్బూకు నిర్వహించి, ఆమెను దేవుడి కమాండర్ గా చేశారు. దేవుడే స్వయంగా ఎంచుకునే ఈ భాగ్యం తనకు దక్కడం ఎంతో సంతోషం అని ఆమెకూడా వెల్లడించారు.

అంతా బాగానే ఉంది. కానీ.. విష్ణమాయ ఆలయంలోని విష్ణుదేవుడు తనకు కమాండర్ గా ముస్లిం మహిళను ఎందుకు ఎంచుకున్నాడు అనేదే పెద్ద సందేహం. ఖుష్బూ 1970 సెప్టెంబరు 29న నఖత్ ఖాన్ పేరుతో ముంబాయిలోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి పేరు నజ్మా ఖాన్. ఆమెకు అబ్దుల్లా, అబూ బకర్, ఆలి అనే సోదరులు కూడా ఉన్నారు. తండ్రి వివరాలు కనీసం పేరు కూడా చెప్పుకోవడానికి ఆమె ఇష్టపడదు. ఆ సంగతి ఎలా ఉన్నా.. ఖుష్బూ ముస్లిం మహిళ. కాకపోతే చెన్నైలో స్థిరపడిన ఆమె తమిళ సినీ పరిశ్రమకు చెందిన సుందర్ ను పెళ్లి చేసుకున్నారు.

విష్ణుమాయ ఆలయంలోని దేవుడు ప్రత్యేకంగా ఈ ముస్లిం మహిళనే ఎంచుకోవడం వెనుక ఆమె భాజపా నాయకురాలు కావడం కారణం కాదు కదా.. అనే సందేహాన్ని కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు.