ఈ ఏడాది సివిల్స్ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచిన ఇషితా కిషోర్ వయసు 26 సంవత్సరాలు. ఆమె సక్సెస్ స్టోరీ ఉత్తేజాన్ని ఇచ్చే రీతిన ఉంది. ఆరేళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న ఇషితా తల్లి ప్రోత్సాహంతో సివిల్స్ వైపు అడుగులు వేసింది.
ఈమె హైదరాబాద్ లో జన్మించింది, ఢిల్లీలో చదువుకుంది. ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్. సివిల్స్ లక్ష్యంగా చేసుకుని ప్రయత్నాలు ఆరంభించిన ఇషిత తన తొలి రెండు అంటెప్ట్స్ లో విఫలం అయ్యింది. అయితే ఆమె ఎక్కడా నిరాశ చెందక మూడో ప్రయత్నం చేయడమే అసలైన ఘనత. తొలి రెండు అటెంప్ట్స్ లో ఇషిత కనీసం ప్రిలిమ్స్ దశను కూడా దాటలేకపోయిందట.
సివిల్స్ ట్రై చేసే వాళ్లలో చాలా మంది ఈ అటెంప్ట్స్ లెక్కల్లో ఎక్కువగా ఉంటారు. తొలి సారే కొట్టేయాలని, లేదా అవకాశాలను వృథా చేసుకోకూడదంటూ లెక్కలేస్తూ ఉంటారు. అయితే సిసలైన విజేతలు వాటి గురించి ఆలోచించరని ఇషిత విజయగాథ చెబుతూ ఉంది.
రెండు సార్లు కనీసం ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయిన.. తదేక దీక్షతో ఆమె అభ్యాసం కొనసాగింది. రోజుకు తొమ్మిది గంటల పాటు చదివినట్టుగా ఇషిత చెప్పింది. సోషల్ లైఫ్ ను హెల్దీగా ఉంచుకున్నట్టుగా చెప్పింది. లేని పోని ఒత్తిళ్లను, అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా.. ఆరోగ్యవంతమైన సోషల్ లైఫ్ తో ఆమె తన లక్ష్యం వైపు అడుగులు వేసింది.
రాజీ పడని రీతిలో కష్టపడటం, సాధించగలననే ఆత్మవిశ్వాసమే తనను యూపీఎస్సీ టాపర్ గా నిలిపిందని ఇషిత గర్వంగా చెబుతోంది. మూడో అటెంప్ట్ లో స్టడీ మెటీరియల్ ను ఫాలో అవుతూ సొంత నోట్స్ తయారు చేసుకుని తన ప్రిపరేషన్ ను సాగించినట్టుగా వివరించింది. సివిల్స్ లక్ష్యంతో ఉన్న వారికి స్ఫూర్తిని పంచేలా ఉంది ఇషితా విజయం.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు