Advertisement

Advertisement


Home > Politics - Opinion

పవన్ కళ్యాణ్ ఈ పాట వింటూ టైం పాస్

పవన్ కళ్యాణ్ ఈ పాట వింటూ టైం పాస్

"తలచినదే జరిగినదా దైవం ఎందులకు- జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు". బహుశా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి ఇదే పాట వినిపిస్తుండాలి. 

ఏదో ఊహించుకుని ఏదో చేసాడు. కానీ పైవాడు అతని ఊహకు అడ్డుపడి బెదరకొడుతున్నాడు. 

జగన్ మోహన్ రెడ్డిని సీయం కుర్చీలోంచి దింపి చంద్రబాబుని కూర్చోపెట్టడమే పవన్ కళ్యాణ్ రాజకీయ లక్ష్యం. దానికోసం కాపు ఓట్లని తెదేపాకి తాకట్టు పెట్టాడు. 

పవన్ కళ్యాణ్ సీయం కేండిడేట్ అంటే కాపులు "మనోడు" కాన్సెప్ట్ ఫాలో అయ్యి ఓట్లేయవచ్చేమో గానీ పోయి పోయి చంద్రబాబుని సీయం చేయడానికి ఎందుకేస్తారు? ఒకపక్కన ఈ శేషప్రశ్న నిద్రిస్తున్న పాములాగ పొంచి ఉంటే, మరొక పక్కన ఊహించని విధంగా కేసీయార్ బుసలుకొడుతూ తన బీఆరెస్ కూటమితో ఆంధ్రకి వచ్చి ఓట్లని చీల్చే పని పెట్టుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్ లో వైకాపాకి ఓట్లేయడం ఇష్టం లేని వాళ్లకి తెదేపా-జనసేన కూటమి, భాజపా కాకుండా ఇప్పుడు మరొక కూటమి కూడ ఉందన్నమాట. ఉత్తరాంధ్రలో వెలమలెక్కువ. వాళ్లల్లో కొందరికి కేసీయార్ నచ్చవచ్చు. మిగిలిన జిల్లాల్లో పలువురికి ఇంకా కమ్యూనిష్ట్ భావజాలం, ఆం ఆద్మీ పార్టీ విధానం నచ్చేవాళ్ళున్నారు. వీళ్లంతా బీఆరెస్ కూటమికి ఓట్లేసి చీలిక తీసుకురావొచ్చు. ఇదంతా పవన్ ఆశలపై నీళ్లు జల్లడమే. 

ఆమధ్యన "ప్రభుత్వవ్యతిరేక ఓటు చీలనివ్వను" అని పవన్ దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అన్నాడు. కానీ ఇప్పుడు కేసీయార్ చేస్తున్న పనికి దిక్కులు చూడాల్సిన పరిస్థితి దాపురించింది పవన్ కి. 

కాపులు, వెలమలు, రాజులు..ఈ మూడు సామాజిక వర్గాల ఓట్లను చీల్చేందుకు కేసీయార్ సమాయత్తమయ్యాడు. కేసీయార్ ఆంధ్ర వ్యతిరేకి కదా అనుకుంటే అది చెప్పుకోవడానికే. ఆమధ్యన విజయవాడ ఎయిర్పోర్టులో దిగితే "జై కేసీయార్" అంటూ నినాదాలు చేసారు జనం. అది గులాబీదళాధిపతికి ఊహించని స్వాగతం. తమని ఓడించినా సరే పోరాటయోధుడిని హీరోలా చూసే నైజం ప్రజలది. ఆ హీరోయిజంలో కనీసం 1వ వంతు కూడా పవన్ కి లేకపోవడం కాపుల దురదృష్టం. నిజంగా ఉండుంటే ఏ కూటమీ తన ఆశల్ని ఏమీ చేసేదీ కాదు. 

కేసీయార్ కి మోదీకి పడకపోవచ్చు కానీ ఇద్దరికీ కామన్ శత్రువు చంద్రబాబు. అతని పార్టీని మళ్లీ లేవకుండా పాతేయడమే వీళ్ల ఇద్దరి ఎజెండా. తద్వారా ఇద్దరూ జగన్ మోహన్ రెడ్డికి మేలు చేస్తున్నారు. తెదేపా నామరూపాల్లేకుండా పోయే వరకు జగన్ మోహన్ రెడ్డికి ఇటు కేసీయార్, అటు మోదీ తో సంబంధాలు బాగానే ఉంటాయి. తెదేపా భూస్థాపితమైపోయాక సమీకరణాలు అప్పటి పరిస్థితులని బట్టి మారితే మారవచ్చు. 

కనుక వర్తమానం మాత్రం తెదేపాకి, జనసేనకి ఏమాత్రం సానుకూలంగా లేదు. తెదాపా-జనసేన కూటమికి బీఆరెస్ కూటమి ఓటమిని మరింత చేరువ చేస్తోంది. 

అందుకే పవన్ ప్రస్తుతం "తలచినదే జరిగినదా దైవం ఎందులకు- జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు" పాటని మననం చేసుకుంటూ ఏ గుంటూరు శేషేంద్రశర్మ పుస్తకాన్నో పట్టుకుని పడక్కుర్చీలో నడుం వాల్చాలి. 

శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?