Advertisement

Advertisement


Home > Politics - Opinion

చంద్రబాబు భయంకర భవిష్యత్తు

చంద్రబాబు భయంకర భవిష్యత్తు

చంద్రబాబు చుట్టూ సరికొత్త ఉచ్చు బిగుసుకుంటోంది. ఓడితే ఒక బాధ, గెలిస్తే పది బాధలు అన్నట్టుగా ఉంది.

బాబు రాజకీయ జీవితం అంధకారంగా, అయోమయంగా, అతలాకుతలంగా, శిరోభారంగా, శిధిలప్రాయంగా మారనుంది. అదేలాగో చూద్దాం. 

రానున్న ఎన్నికల్లో వైకాపాదే గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయి. పోయిన సారికంటే ఈ సారి వైకాపాకి ఎన్ని సీట్లు తగ్గుతాయి, ఎన్ని పెరుగుతాయి అనే టాపిక్ మీద చర్చలుంటున్నాయి తప్ప ఆ పార్టీ ఓటమి గురించి టాపిక్ లేదు. 

తెదేపా గెలుపు గురించి కెమెరాల ముందు పచ్చ మీడియా వాళ్లు తప్ప, ఆఫ్ ది రికార్డ్ లో వాళ్లు కూడా వైకాపా ఓటమిని ఊహించట్లేదు. 

దీనికి తగ్గట్టుగానే ఉంది ప్రతిపక్ష కూటమి పరిస్థితి. మూడు పార్టీలు కలిసినట్టుగా కనిపిస్తున్నా కూడా కలిసికట్టుగా ఉన్నట్టు లేవు. అంతర్గతంగా ఏడుపులు, పెడబొబ్బలు వినిపిస్తున్నాయి. సీట్ల సర్దుబాటు విషయం కొంత, అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న మోదీ వైఖరి కొంత ఆ కూటమి ఉత్సాహాన్ని నీరుగారుస్తున్నాయి. 

ఓడే ఆటకి హైరానా ఎందుకున్నట్టుగా మొక్కుబడికి వచ్చిన నరేంద్రమోదీ నాలుగు ముక్కలు వల్లించి వెళ్లిపోయాడు. దాంతో తెలుగు తమ్ముళ్లంతా మనసు విప్పి మోదీని తిట్టలేక, పొగడడానికి పాయింట్ లేక మౌనవ్రతం పాటిస్తున్నారు. 

ఇదిలా ఉంటే తనకి సీటివ్వలేదని రఘురామరాజు కత్తిని దూస్తున్నాడు. తొలుత జగన్ ని, సోము వీర్రాజుని తనకి సీటు రాకపోవడానికి కారణభూతులని చెప్పినా... చంద్రబాబు తనకోసం పోరాడాల్సిందేనని, భాజపాతో గొడవపెట్టుకునైనా నర్సాపురం సీటు తనకి ఇప్పించాల్సిందేనని రాజశాసనం చేసాడు. 

తాను తెదేపా కండువా కప్పుకోకపోయినా, భాజపా తీర్ధం పుచ్చుకోకపోయినా ఇలా అనగలుగుతున్నాడంటే ఇక సీటొచ్చి గెలిస్తే పరిస్థితి ఏంటి? కూటమి కూడా గెలిస్తే సన్నివేశమేంటి?

రఘురామరాజు అడిగిన ప్రాజెక్టునల్లా చంద్రబాబు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే రాజాగ్రహానికి కమ్మప్రభువు వణకాల్సిందే. అలా ఇవ్వలేదనే కదా ఆయనకి జగన్ మోహన్ రెడ్డితో గొడవ.

ఇదిలా ఉంటే కూటమి గెలిస్తే చంద్రబాబు ఎదుర్కోవాల్సిన అన్నిటికంటే పెద్ద సవాలు కాపు నాయకుల అనుచరులూ

అసలేమీ లేకుండానే "బలహీనంగా ఉన్న తెదేపాకి మనం ధైర్యమివ్వాలి" అంటూ పవన్ కళ్యాణ్ పెద్ద స్టేట్మెంటిచ్చాడు ఆమధ్య చంద్రబాబు అరెస్ట్ టైములో. ఇక నిజంగా గెలిస్తే ఇంకేమైనా ఉందా? అసలా గెలుపు తమ వల్లే వచ్చిందని, ముఖ్యమంత్రి అయినా సరే.. చంద్రబాబుని కుక్కినపేనులా పడుండమంటారు. దశాబ్దాలుగా ఉగ్గపట్టుకుని ఉన్న రాజ్యాధికారవాంఛని దురుసుగా వాడతారు. "దురుసుగా" ఎందుకంటే తెదేపా సామాజికవర్గ ప్రమేయం లేకుండా తాము ఏలగలమని చూపించడానికి, తమదే పైచేయని నిరూపించడానికి...!

ఆ ఊపులో అసలు నాయకులు ఎలా ఉన్నా వెనుకనున్న అనుచరలు అరాచకాలు చేస్తారు. గోదావరి జిల్లాల్లో దళితులకి, గిరిజనులకి అక్కడి కాపులతో సయోధ్య ఉండదు. ఈ రెండు వర్గాల మధ్య చిచ్చు రగులుకోవచ్చు. దానిని ఆర్పడానికి చంద్రబాబు నానా ఇబ్బందులూ పడాలి. ఒక రకంగా చెప్పాలంటే కాపుల అధికారవాంఛని, వాళ్ల దూకుడుని చంద్రబాబు తట్టుకోలేడు. ఇప్పుడు టికెట్ల విషయంలో అంతర్గత పోరుకి వందింతల అసలు పోరు అప్పుడు చోటు చేసుకుంటుంది. 

ఇక చైతన్య-నారాయణ విద్యాసంస్థల యజమానులు ఈ ఎన్నికల్లో చాలా ఖర్చు పెడుతున్నారు. రేపు గెలిస్తే ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వపాఠశాలలను నడవనిస్తారా? పునరుద్ధరణ చెందిన ప్రభుత్వ బడుల దెబ్బకి వీళ్ల వ్యాపారాలు ఇప్పటికే బాగా దెబ్బతిన్నాయి. కనుక ఆ ప్రభుత్వ బడుల్ని మళ్లీ పూర్వస్థితికి తీసుకెళ్లమని ప్రభుత్వంపై లోపాయికారీ ఒత్తిడి పెంచరా? అలా చేస్తే ప్రజాగ్రహం తప్పదు. చెయ్యకపోతే ఈ ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు ఫుట్-బాల్ ఆడతారు బాబుని. 

మరో వైపు అమరావతి బ్యాచ్. ఆ ఉద్యమంలోని నాయకులు ప్రతి ప్రాజెక్ట్ అక్కడే రావాలని డిమాండ్ చేస్తారు. మరో ప్రాంతాన్ని అభివృద్ధి చెందనీయరు. ఏకీకృత రాజధాని.. అదీ ఒక్క అమరావతే అనే నినాదం దేనికంటే సకల పెట్టుబడులు అక్కడికే రావాలి, రియలెస్టేట్ పెరగాలి..అదే కదా లెక్క! గతంలో రాయలసీమకి రావాల్సిన ఎయిమ్స్ ని మంగళగిరిలో పెట్టడం, ఐటీ కంపెనీలని విజయవాడకి తరలించడం లాంటివన్నీ మనం 2014-19 మధ్య చూసాం. జగన్ మాత్రం అన్ని ప్రాంతాలపై దృష్టిపెడుతూ వచ్చాడు. మళ్లీ అవన్నీ వెనక్కి వెళతాయి. అలాంటి ఒత్తిడి బాబుపై ఉంటుంది. ఈ ఒత్తిడికి చంద్రబాబు లొంగితే తక్కిన ప్రాంతాల నాయకులు తిరగబడతారు. లొంగకపోతే అమరావతి నాయకులు, ప్రజలు తిరగబడతారు. దానిని ఎదుర్కోవాలి. 

అలాగే సోషల్ మీడియా యోధులున్నారు. వాళ్లకి ఏదో విధంగా లబ్ధి చేకూర్చమని ఒత్తిడుంటుంది. లేకపోతే ఏకులు మేకులవుతారు. రివర్స్ వీడియోలు చేసి దుంప తెంచుతారు. భంగపడ్డ ఒక్కో సోషల్ మీడియా యోధుడు ఒక్కో రఘురామరాజయ్యి పక్కలో బల్లేల్లా మారతారు. వీళ్లందర్నీ కాసుకోవాలి. 

అలాగే జగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా వాగ్దానాలు చేస్తున్నాడు బాబు. అవన్నీ నెరవేర్చమని ప్రజలు పీక్కుతింటారు. ఇవ్వకపోతే ధర్నాలు గట్రా చేస్తారు. ఇవ్వాలంటే నిధులు చాలవు. ఫోన్ కొడితే మోదీ ఇచ్చేస్తాడనుకోవడం కూడా అంత ఈజీ కాదు. ఒకవేళ ఇచ్చినా మోదీ ఫోటోతో, మోదీ పెట్టిన పేరుతో స్కీములుండొచ్చు. ఎందుకంటే అధికారికంగా కూటమిలో ఆ పార్టీ ఉంది కనుక. మోదీ చెప్పిన డబులింజన్ ప్రభుత్వమంటే ఇదే మరి. అలా చేస్తే అంతా మోదీయే చేస్తున్నాడు, బాబు చేస్తున్నది ఏదీ లేదని ప్రజలు తెదేపాని మానసికంగా దూరం పెడతారు. 

గతంలో గెలిస్తే చంద్రబాబు తనకు అంతవరకూ సాయపడిన వాళ్లని పట్టించుకునే వాడు కాదు. ఇప్పుడలా కుదరదు. ముక్కుపిండి తాట తీసి పట్టించుకునేలా చేస్తారు. అసలే కూటమి వల్ల అధికారం ఏకీకృతంగా ఉండదు. ప్రతి కూటమి అధినేత సమానమే. చంద్రబాబు ఆడిందే ఆటగా, చేసిందే శాసనంగా ఉండదు. 

ఈ గజిబిజి గందరగోళం మధ్య ఇక కేంద్ర భాజపా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలీదు. ఎంత పొత్తు పేరుతో పక్కలో పడుకోబెట్టుకున్నా తేదేపాకి భాజపా అనేది పాములాంటిదే. ఎప్పుడైనా పడగ విప్పొచ్చు. అటు మహారాష్ట్రలో శివసేనని చీల్చి ఆడుకుంటోంది భాజపా. అదే సీన్ కర్ణాటక, తెలంగాణాలకు కూడా తప్పకపోవచ్చు. అదే ఫార్ములాతో కూటమిని చీల్చి తమ భాజపా జెండాని రాష్ట్రంలో పాతుకునే దిశగా రాజకీయం చేయొచ్చు. వీటన్నిటికీ మౌనసాక్షిగా, మౌనబాధితుడిగా చూస్తూ ఉండాలే తప్ప గతంలోలాగ రాజకీయచక్రం తిప్పే సన్నివేశాలు ఉండవు చంద్రబాబుకి. 

దీనిని బట్టి అర్ధమవుతున్నదేంటంటే గెలిచినా చంద్రబాబుకి క్షణం మనశ్శాంతి ఉండదు. వెన్నుపూస మీద ఎప్పుడూ ఎవడో ఒకడు కాలేసి తొక్కుతున్నట్టుగానే ఉంటుంది బాబుకి. దీనికంటే స్కిల్ స్కాములో లోపలికెళ్లి కూర్చున్న 52 రోజులే ప్రశాంతంగా ఉన్నాయని అనుకోవచ్చు బాబు. 

ఓడితే జగన్ నుంచే భయం. గెలిస్తే పైన చెప్పుకున్న సమస్త సమూహాలనుంచీ దినదినగండమే. 

ఇలాంటి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాభివృద్ధి వగైరాలన్నీ మళ్లీ గ్రాఫిక్సులో చూసుకోవాలి తప్ప నిజరూపం దాల్చడం జరిగే పనే కాదు. ఇన్నేసి ఒత్తిడుల మధ్య ముఖ్యమంత్రి సీటంటేనే వైరాగ్యం కలిగేలాంటి పరిస్థితి దాపురించొచ్చు చంద్రబాబుకి. ఎందుకంటే అంతమందిని వాడేసాడు మరి. వాడబడ్డవాళ్లంతా గుండెలమీద కుంపట్లౌతారు. ఆ మంటని మోస్తూనే ఉండాలి. అదీ బాబు గెలిస్తే భవిష్యత్తు. 

ఇక ఓడితే సీన్ వేరు. గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆగమన్నా ఆగకుండా భాజపాలోకి జంపౌతారు. చంద్రబాబుకి జెండా తప్ప జనం మిగలరు. ఆ జెండాని కమలం కాళ్ల దగ్గర పెట్టేసి శరణువేడేసి రాజకీయ సన్యాసం చేసేయాలి. లేదా ఆ పార్టీని భాజపాలో విలీనం చేసేయాలి. ఆ రెండూ కాదనుకుంటే కేసులన్నీ కోరలు విప్పుతాయి. కటకటాల తలుపులు తెరుచుకుంటాయి. 

- హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?