ఆంధ్రప్రదేశ్లో కీలకమైన ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వస్తున్నారు. వీళ్లిద్దరూ ఏపీ ఎన్నికల ప్రచారానికి రావాలని వైసీపీ కోరుకుంటోంది. ఎట్టకేలకు అధికార పార్టీ కోరికను మోదీ, అమిత్షా నెరవేర్చనున్నారు. బీజేపీ అగ్రనేతలైన మోదీ, అమిత్షా ఏపీ ఎన్నికల ప్రచారానికి రావాలని వైసీపీ కోరుకోడానికి బలమైన కారణం వుంది. ప్రస్తుతం ముస్లిం రిజర్వేషన్లపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోలో మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఇక్కడ టీడీపీ, జనసేనతో కలిసి పొత్తులో వుండడం వల్ల బీజేపీ ప్రత్యేకంగా ఆ రకంగా మేనిఫెస్టో ఇవ్వలేకపోతోంది. అంతే తప్ప, బీజేపీ మళ్లీ వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు ఖాయమని తాజాగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ముస్లింలు రగిలిపోతున్నారు. నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు అవుతాయని ఆందోళన చెందుతున్నారు.
గతంలో వైఎస్సార్ ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తే విద్య, ఉద్యోగ తదితర అంశాల్లో భారీగా నష్టపోతామని ముస్లింలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ భయానికి, ఆందోళనకు కారణమైన బీజేపీ అగ్రనేతలు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా అంటే మైనార్టీలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వాళ్లిద్దరూ ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన అగ్రనాయకులు చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్తో కలిసి ప్రచారం నిర్వహిస్తే, కూటమికి రాజకీయంగా భారీ దెబ్బ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏపీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల కావడం విశేషం. మే 3,4 తేదీల్లో మోదీ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే అమిత్షా కూడా ప్రచారం చేస్తారని బీజేపీ కూటమి నేతలు చెబుతున్నారు. ఇంకా తేదీలు ఖరారు కాలేదు. మోదీ, అమిత్షా వెంట బాబు, పవన్ నడిస్తే చాలు... మైనార్టీల ఓట్లన్నీ గోవిందా అని టీడీపీ నేతలు భయపడుతున్నారు. అలాగే విభజిత ఏపీకి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందనే బాధ రాష్ట్ర ప్రజానీకంలో వుంది. ఇవన్నీ కూటమికి నష్టం తెచ్చేవే. ఇదే సందర్భంలో వైసీపీ కోరుకోకుండానే వచ్చే ప్రయోజనమని పలువురు చెబుతున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు