Advertisement

Advertisement


Home > Politics - Andhra

వెయ్యి కోట్ల కోసం జ‌గ‌న్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్న ష‌ర్మిల‌

వెయ్యి కోట్ల కోసం జ‌గ‌న్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్న ష‌ర్మిల‌

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌పై వైఎస్సార్ అభిమాని, వైఎస్సార్‌టీపీ మాజీ నాయ‌కుడు కొండా రాఘ‌వ‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్‌పై ష‌ర్మిల అవాకులు చెవాకులు పేలిన నేప‌థ్యంలో ఆయ‌న ఘాటుగా స‌మాధానం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల‌పై ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు కూడా చేశారు. వెయ్యి కోట్ల ఆదాయం వ‌చ్చే ప‌ని జ‌గ‌న్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆయ‌న్ను ష‌ర్మిల‌, ఆమె భ‌ర్త అనిల్‌కుమార్, అత‌ని స్నేహితులు ఒక దొంగ‌ల ముఠాగా ఏర్ప‌డి బ్లాక్ మెయిల్ చేస్తున్నార‌ని రాఘ‌వ‌రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ చేయడం గ‌మ‌నార్హం. 

ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ష‌ర్మిల‌కు స‌వాల్ విసిరారు. తెలంగాణ‌లో త‌ట్ట‌బుట్ట స‌ర్దుకుని, అక్క‌డి ప్ర‌జ‌ల‌ను మోసం చేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అడుగు పెట్టావని ష‌ర్మిల‌పై విమ‌ర్శ‌లు చేశారు. ఏపీలో అడుగు పెట్ట‌డానికి కార‌ణాలు చాలా ఉన్నాయన్నారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పెళ్లిని ల‌క్ష మందితో పులివెందులలో చేశార‌న్నారు. ఆ పెళ్లికి చంద్ర‌బాబుకు ఆహ్వానం లేద‌న్నారు. బాబు ఆ పెళ్లికి రాలేదని రాఘ‌వ‌రెడ్డి తెలిపారు. జ‌గ‌న్‌పై నిత్యం అవాకులు చెవాకులు పేలే న‌ర‌రూప రాక్ష‌సుడైన చంద్ర‌బాబునాయుడి ఇంటికి ప‌సుపు చీర క‌ట్టుకెళ్లి, ఆయ‌న ఇంట్లో రెండు గంట‌లు కూచుని, పెండ్లి ప‌త్రిక ఇచ్చి వ‌చ్చావన్నారు.

ఆ ఇంటి నుంచి బ‌య‌టికొచ్చిన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్‌ను తిట్ట‌డం మొద‌లు పెట్ట‌డం వ‌ల్లే ప్ర‌తి ఒక్క‌రికీ అనుమానం క‌లుగుతోంద‌న్నారు. జ‌గ‌న్‌పై ఒంటికాలిపై లేవ‌డం అప్ప‌టి నుంచే అని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబుతో బేరం కుద‌ర‌డం వ‌ల్లే ష‌ర్మిల అట్ల చేస్తోంద‌ని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. 

చంద్ర‌బాబుతో బేరం కుదిరిన త‌ర్వాతే, చ‌చ్చిపోయిన కాంగ్రెస్‌కు అధ్య‌క్ష ప‌ద‌వి తెచ్చుకుని, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తోంద‌న్నారు. చంద్ర‌బాబు ఆడుతున్న పాచిక‌లాట‌లో మెరుసుప‌ల్లి ష‌ర్మిల పాచిక అయ్యింద‌న్నారు. జ‌గ‌న్‌కు అద్దం పంప‌డం కాదు, అది ఇంటికి తీసుకెళ్లి , మేక‌ప్ తీసేసి ఒక్క‌సారి ముఖం చూసుకోవాల‌ని ష‌ర్మిల‌కు ఆయ‌న సూచించారు. ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడావో తెలుస్తుంద‌ని ష‌ర్మిల‌కు చీవాట్లు పెట్టారు. 

మెరుసుప‌ల్లి ష‌ర్మిల‌గా త‌న ప్ర‌శ్న‌ల‌కు స్పందించాల‌ని కొండా రాఘ‌వ‌రెడ్డి స‌వాల్ విసిరారు. నువ్వు, నీ చెల్లి న‌ర్రెడ్డి సునీత వివేకా హ‌త్య కేసు చార్జిషీట్ తీసుకురావాల‌ని కోరారు. ఆ చార్జిషీట్‌పైనే మాట్లాడ్దామ‌ని స‌వాల్ విసిరారు. 11వ తేదీ వ‌ర‌కూ ప్ర‌చారం చేసుకునే అవ‌కాశం వుంద‌న్నారు. ఆ లోపు మ‌నంద‌రి తండ్రి గారైన వైఎస్సార్ స‌మాధి వ‌ద్ద‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు. 

వివేకా హ‌త్య కేసులో అవాకులు చెవాకులు మాట్లాడ్డం మానేయాల‌ని ఆయ‌న కోరారు. పాద‌యాత్ర చేయాల‌ని జ‌గ‌న్‌, భార‌తి, విజ‌య‌మ్మ‌... ఏ ఒక్క‌రూ చెప్ప‌లేద‌ని ష‌ర్మిల‌పై రాఘ‌వ‌రెడ్డి విరుచుకుప‌డ్డారు. వివేకా ఇప్పుడే గుర్తుకొచ్చారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. వివేకా చ‌నిపోయిన త‌ర్వాత ఐదుసార్లు వ‌ర్ధంతి, ఐదుసార్లు జ‌యంతి వ‌చ్చాయ‌ని ష‌ర్మిల‌కు రాఘ‌వ‌రెడ్డి సూచించారు. ఎన్నిసార్లు వివేకా స‌మాధి వ‌ద్ద‌కు పోయావ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. మీరు అడిగిన రూ.1000 కోట్లకు సంబంధించి  త‌ప్పుడు ప‌ని చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే మీరు, మీ భ‌ర్త‌, అత‌ని వెంట ఉన్న వారు ఒక ముఠాగా ఏర్ప‌డి జ‌గ‌న్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్న‌ది వాస్త‌వ‌మా? కాదా? అని ఆయ‌న నిల‌దీశారు. దీనికి జ‌వాబు చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 

చ‌చ్చిపోయిన కాంగ్రెస్‌కు అధ్య‌క్ష ప‌ద‌వి తీసుకోడానికి డీకే శివ‌కుమార్, రేవంత్‌రెడ్డి, చంద్ర‌బాబునాయుడు కార‌ణ‌మ‌న్నారు. జ‌గ‌న్‌ను ఎదుర్కోలేని చంద్ర‌బాబునాయుడు చేతిలో నువ్వు కీలుబొమ్మ అయిన మాట వాస్త‌వం కాదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఆ మాట చెప్ప‌కుండా అద్దం తీసుకొచ్చి త‌మాషా చేస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. మే 13వ తేదీ త‌ర్వాత నీ బ‌తుకు బ‌జారు పాల‌వుతుంద‌ని ఆయ‌న అన్నారు. హైద‌రాబాద్ కూడా వ‌దిలి అమెరికా పారిపోయే ప‌రిస్థితి వ‌స్తుంద‌న్నారు. ఇప్ప‌టికైనా నోరు జాగ్ర‌త్త పెట్టుకోవాల‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?