తెలుగుదేశం హయాంలో, 2001-02 సమయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన జడ్పీ ఎన్నికల్లో అనంతపురం జడ్పీ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ తన బలప్రయోగం ద్వారా దక్కించుకుంది.
అప్పట్లో అనంతపురం టీడీపీకి అంతా తానైన నాటి ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర అనంతపురం జడ్పీ చైర్మన్ గా టీడీపీ వ్యక్తిని కూర్చోబెట్టడానికి బెదిరింపు ప్రయోగం చేశారు. ప్రజలు తెలుగుదేశం పార్టీని జడ్పీ ఎన్నికల్లో గెలిపిస్తారనే నమ్మకం లేని పరిస్థితుల్లో.. కాంగ్రెస్ అభ్యర్థులను బెదిరించి వారి చేత నామినేషన్లను ఉపసంహరింపజేసి, జడ్పీ పీఠంపై తెలుగుదేశం వ్యక్తిని కూర్చోబెట్టారు పరిటాల రవీంద్ర.
నామినేషన్ల గడువు ముగిశాకా, ఉపసంహరణ ఘట్టంలో కాంగ్రెస్ జడ్పీటీసీల చేత నామినేషన్లను ఉపసంహరింపజేసిన చరిత్ర పరిటాల రవి. అలా అప్పట్లో జడ్పీ పీఠం తెలుగుదేశం పార్టీకి దక్కింది. ధర్మవరం నుంచి కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థిని కూడా అప్పుడు విత్ డ్రా చేయించారు. తద్వారా ధర్మవరంలో టీడీపీ ఏకగ్రీవంగా నెగ్గింది. అక్కడ నుంచి తెలుగుదేశం తరఫున ఏకగ్రీవంగా నెగ్గిన చిగిచెర్ల ఓబిరెడ్డినే జడ్పీ వైఎస్ చైర్మన్ గా చేశారు.
అది పరిటాల హయాం. ఎలాగూ స్పష్టమైన మెజారిటీ రాదనే క్లారిటీతో నామినేషన్ల ఘట్టంలోనే పరిటాల రవీంద్ర బలవంతంగా, చంపుతామనే బెదిరింపులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను విత్ డ్రా చేయించారు. అప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల, కార్యకర్తల హత్యల నేపథ్యంలో భయం ఉన్న వారు విత్ డ్రా చేసుకోక తప్పని పరిస్థితి!
ఇక 2006 సమయంలో జరగిన జడ్పీ ఎన్నికల్లో జేసీ అడ్డదారి తొక్కారు. నాడు అనంతపురం జడ్పీలో కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీ ఎక్కువ జడ్పీటీసీల నంబర్ ను కలిగి ఉంది. దాంతో టీడీపీకే జడ్పీ చైర్మన్ పీఠం దక్కే పరిస్థితి. అయితే అనంతపురం కాంగ్రెస్ కు అంతా తానే అన్నట్టుగా వ్యవహరించిన జేసీ దివాకర్ రెడ్డి జడ్పీ మేయర్ ఎన్నిక ప్రక్రియలో జోక్యం చేసుకున్నారు. ఎన్నిక జరుగుతున్న వేళ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నెగ్గిన ఇద్దరు మెంబర్లను ఇటు వైపుకు తిప్పుకున్నారు. అనంతపురం జడ్పీ చైర్మన్ తోపుదుర్తి కవిత ఎన్నికయ్యారప్పుడు.
ఈ రెండు సందర్భాల్లోనూ పచ్చమీడియా రెండు రకాల హెడ్డింగులు పెట్టింది. బలం లేకపోయినా బెదిరింపులతో టీడీపీ అనంతపురం జడ్పీ చైర్మన్ పీఠాన్ని సొంతం చేసుకున్నప్పుడేమో ఈనాడు పత్రిక 'చక్రం తిప్పిన చంద్రబాబు, అనంత జడ్పీ తెలుగుదేశం వశం' అంటూ హెడ్డింగ్ పెట్టింది ఆ పత్రిక.
ఇక దివాకర్ రెడ్డి తన బలప్రయోగంతో ఇద్దరు జడ్పీటీసీ లను తిప్పుకుని జడ్పీ పీఠాన్ని తన పార్టీ వారికి దక్కించుకున్నప్పుడేమో యథాతథంగా పచ్చపత్రిక నిప్పులు చెరిగింది. ప్రజాస్వామ్యానికి ముప్పు అన్నట్టుగా రాసింది. తెలుగుదేశం వాళ్లు చేస్తే పచ్చపత్రికలకు సమ్మగా ఉంటుంది, అదే వేరే వాళ్లు చేస్తే ఈ పత్రికకు ఎక్కడలేని ప్రజాస్వామ్య విలువలు గుర్తుకు వస్తాయి.
ఇప్పుడిదంతా ఎందుకంటే.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బలాబలాలు కాస్త అటూ ఇటు ఉన్న సమయంలో.. గత ఉదంతాలు ప్రజల్లో చర్చకు వచ్చాయి. తన కత్తికి పదునున్నప్పుడు పరిటాల రవి బెదిరింపులు, హెచ్చరికలతో అప్రజాస్వామ్యికంగా అనంత జడ్పీ పీఠంపై తన అనుచరులను కూర్చోబెట్టారు. ఇక అధికారం చేతిలో ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి కూడా అదే దారిన పయనించినో, కొనుగోలు చేశో.. ఇద్దరు జడ్పీటీసీలను తమ వైపుకు తిప్పుకున్నారు.
ఇక ప్రస్తుతానికి వస్తే.. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలో మాత్రం పై రెండూ జరగలేదు. బలాబలాలు, నంబర్లను బట్టి మాత్రమే.. అక్కడ ఎన్నిక జరిగింది. పరిటాల రవి అయినా, జేసీ దివాకర్ రెడ్డి అయినా తమ చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకున్ని గతంలో ప్రజాస్వామ్యానికి పాతరేశారు. ఇప్పుడు అదే జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు ప్రజాస్వామ్యుతంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అధికారం ఉందని విర్రవీగిన వారికి.. ఇది మామూలు పాఠం కాదు.
గతంలో పరిటాల రవి దౌర్జన్యపు రాజకీయాలను, జేసీ దివాకర్ రెడ్డి మార్కు మార్కు రాజకీయాలను చూసిన అనంతపురం జిల్లా ప్రజలకు మాత్రం.. ప్రస్తుత రాజకీయాలు కొత్తగా, సవ్యంగా తోస్తున్నాయి.