కాపు ఉద్యమానికి మాజీ మంత్రి, ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇక శాశ్వతంగా స్వస్తి పలికారు. గత జూలైలో కాపులకు బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు చేపట్టిన ఉద్యమం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్టు ముద్రగడ పద్మనాభం ప్రకటించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో తనపై పెడుతున్న నెగెటివ్ పోస్టింగ్లకు మనస్థాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా అప్పుడు కాపులను ఉద్దేశించి బహిరంగ లేఖ కూడా రాశారు. ఆ లేఖలో ఆయన ఏమన్నారంటే...
‘ఈ మధ్య పెద్దవారు చాలామంది మన సోదరులతో నేను మానసికంగా కుంగిపోయే విధంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాడులు చేయిస్తున్నారు. నేను ఆ రోజు ఉద్యమంలోకి రావడానికి కారణం.. చంద్రబాబే. మన జాతికి బీసీ రిజర్వేషన్ ఇస్తానన్న హామీ అమలు కోసం ఉద్యమ బాట పట్టాను. ఈ ఉద్యమం ద్వారా డబ్బు, పదవులు పొందాలని ఏనాడూ అనుకోలేదు’ అని లేఖలో పేర్కొనడం కాపుల్లో ఆందోళన కలిగించింది.
అయితే ముద్రగడ పద్మనాభాన్ని తిరిగి కాపు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాలని కోరాలని కాపు నేతలు నిన్న సమావే శమై తీర్మానించారు. ఈ మేరకు ఆయన్ను స్వయంగా కలిసి విన్నవించాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు సోమవారం కిర్లంపూడిలో ఆయన నివాసంలో కాపు జేఏసీ నేతలు ముద్రగడను కలిశారు. ఉద్యమ నేతగా కొనసాగాలంటూ ముద్రగడను కోరారు.
కానీ కాపు జేఏసీ నేతల విజ్ఞప్తులు ఆయన మనసులో మార్పు తీసుకురాలేక పోయాయి. తాను తీసుకున్న నిర్ణయంపైనే ఆయన గట్టిగా నిలబడ్డారు. ఒక్కసారి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేనని సున్నతంగా ...కాపు జేఏసీ నేతల విన్న పాన్ని తిరస్కరించినట్టు తెలుస్తోంది. కాపు ఉద్యమంలోకి తాను వచ్చేది లేదని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. కాపు జేఏసీ నేతలు వచ్చేసరికే సిద్ధంగా చేసుకున్న లేఖను వారికి ముద్రగడ అందజేశారు. అనంతరం ఆ లేఖను ముద్రగడ విడుదల చేశారు.
‘గౌరవ పెద్దలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటున్నాను. మీ కోరికను గౌరవించలేక పోతున్నందుకు క్షమించాలని కోరుతున్నాను. వ్యక్తిగతంగా నేను మీతోనే ఉంటాను. మనం మంచి స్నేహితులం. మీ ఇంటిలో ఏ కార్యక్రమం ఉన్నా తెలియచేస్తే నా ఓపిక ఉన్నంత వరకూ వస్తాను.
మీ అందరి అభిమానం, ప్రేమ మరువలేనిది. నా ఇంటిలో ఏ శుభకార్యం ఉన్నా నేనే స్వయంగా జిల్లాలకు వచ్చి ఓపిక ఉన్నంత వరకూ ఆహ్వానిస్తాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దని కోరుతున్నాను’ అని ఆ లేఖలో ముద్రగడ తెలిపారు. దీంతో కాపు జేఏసీ నేతలు నిరాశతో వెనుతిరిగారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు