తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ తన శిక్షకాలాన్ని పూర్తి చేసుకుని విడుదల అయ్యారు. అక్రమాస్తుల కేసులో శిక్షను ఎదుర్కొంటున్న శశికళ గత కొన్నేళ్లుగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.
శిక్ష కాలాన్ని పూర్తి చేసుకోవడంతో ఆమె విడుదల అయ్యారు. అయితే శశికళ ఇంకా బయట అడుగు పెట్టలేదు. ఎందుకంటే ఆమె ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ఇటీవలే శశికళ జైల్లోనే కరోనాకు గురయ్యారట. దీంతో ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్సను పొందుతూ ఉన్నారని సమాచారం.
ఇంతలోనే ఆమె శిక్ష కాలం కూడా పూర్తవ్వడంతో..ఆమె విడుదలకు సమ్మతిని తెలియజేస్తూ కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు పత్రాలను అందించారట. ఆసుపత్రికి వెళ్లి వారు విడుదలకు సంబంధించిన పేపర్లను అందించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో శశికళకు జైలు నుంచి విముక్తి లభించినట్టుగా అయ్యింది.
ఆమె కరోనా నుంచి కూడా కోలుకున్నారని.. త్వరలోనే ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జి కాబోతున్నారని తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావొచ్చని కథనాలు వస్తున్నాయి. అయితే ఆమె కనీసం పది రోజుల పాటు డిశ్చార్జి కారనేది మరో కథనం.
అయితే ఆమె ఆసుపత్రిలో ఉన్నా.. ఇక స్వేచ్ఛగా ఉండే అవకాశం ఉంది. రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి ఫోన్ల ద్వారానే ఆదేశాలు ఇచ్చే స్వేచ్ఛ శశికళకు లభించినట్టే. ఇప్పటికే పలువురు అన్నాడీఎంకే కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకున్నారట. అలాగే ఓపీఎస్-ఈపీఎస్ ల పొడగిట్టని నేతలు కూడా కొందరు శశికళతో సమావేశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం.
సరిగ్గా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ శశికళ ఆ రాష్ట్రంలో అడుగుపెట్టబోతున్నట్టున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో!
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు