Advertisement

Advertisement


Home > Politics - Political News

క‌డ‌ప వాళ్ల‌ను నేను ఏమీ అన‌లేదు

క‌డ‌ప వాళ్ల‌ను నేను ఏమీ అన‌లేదు

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు త‌ప్పు మాట్లాడ్డ‌మే కాకుండా, మ‌ళ్లీ బుకాయింపున‌కు తెగ‌బ‌డ్డారు. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున త‌న‌పై ట్రోలింగ్ జ‌రుగుతుండ‌డంతో ఆయ‌న స్పందించ‌క త‌ప్ప‌లేదు. పైగా ప్ర‌త్య‌ర్థుల‌కు ఓ ఆయుధం ఇచ్చిన‌ట్టైంది. అస‌లే ఏపీలో అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీకి సోము వీర్రాజు ఇటీవ‌ల చేస్తున్న వ్యాఖ్య‌లు మ‌రింత శాపంగా ప‌రిణ‌మించాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

సోము వీర్రాజు ఓ క‌మెడియ‌న్‌ను త‌ల‌పించేలా మాట్లాడుతున్నార‌నే వ్యంగ్యోక్తులు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌ల్ని కించ‌ప‌రిచేలా సోము వీర్రాజు తాజా వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. 

పార్టీల‌కు అతీతంగా రాయ‌ల‌సీమ స‌మాజం సోము వీర్రాజు కించ‌ప‌రిచే వ్యాఖ్య‌ల‌పై తీవ్ర‌స్థాయిలో రియాక్ట్ అయ్యింది. ప్రాణాలు తీసే ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్‌లు క‌ట్టించామ‌ని క‌డ‌ప ఎయిర్‌పోర్ట్‌ను ఉద్దేశించి వీర్రాజు వీర్రావేశంతో ఊగిపోతూ అన్నారు. ఈ వ్యాఖ్య‌లు సీమ స‌మాజాన్ని ఎంత‌గా హ‌ర్ట్ చేశాయో... త‌న‌పై సోష‌ల్ మీడియాలో సాగుతున్న ట్రోలింగే ఆయ‌న‌కు నిరూపించింది.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న స్పందించ‌క త‌ప్ప‌లేదు. త‌న వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుగా చిత్రీక‌రించార‌ని బుకాయించారు. క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌లు హ‌త్య‌లు చేస్తార‌నే ఉద్దేశంతో తాను మాట్లాడ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య ఘ‌ట‌న‌ను ఉద్దేశించి మాత్రమే తాన‌లా మాట్లాడిన‌ట్టు చెప్పుకొచ్చారు. త‌న వ్యాఖ్య‌ల‌తో క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సంబంధం లేద‌ని సోము వీర్రాజు వివ‌ర‌ణ ఇచ్చారు.

ఇప్ప‌టికీ తాను పొర‌పాటున మాట్లాడ‌న‌ని ఆయ‌న నోటి వెంట మాట రాక‌పోవ‌డం విడ్డూరం. క‌నీస ప‌శ్చాత్తాపం కూడా సోము వీర్రాజు మాట‌ల్లో క‌నిపించ‌లేద‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. త‌ప్పు చేయ‌డ‌మే కాకుండా, దాన్ని క‌ప్పి పుచ్చుకోవ‌డం ఒక్క సోము వీర్రాజుకే ద‌క్కింద‌నే దెప్పిపొడుపులు సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. నోరు జార‌డం, విమ‌ర్శ‌లు వ‌స్తే... తాన‌లా అన‌లేద‌ని చెప్ప‌డం వీర్రాజుకు ప‌రిపాటైంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?