మరో కొత్త టాపిక్ ఎత్తుకున్న ప్రభాస్ ఫ్యాన్స్

సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నారు. తమ హీరో సినిమాలపై తామే ఊహాగానాలు సృష్టించి, సదరు టైటిల్స్ ను ట్రెండింగ్ లో వచ్చేలా చేస్తున్నారు. మొన్నటికిమొన్న రాధేశ్యామ్…

సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నారు. తమ హీరో సినిమాలపై తామే ఊహాగానాలు సృష్టించి, సదరు టైటిల్స్ ను ట్రెండింగ్ లో వచ్చేలా చేస్తున్నారు. మొన్నటికిమొన్న రాధేశ్యామ్ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోందంటూ ప్రచారం చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. దెబ్బకు మేకర్స్ దిగొచ్చి, అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 

ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా సలార్ పై పడ్డారు. ఈ మూవీకి సంబంధించి ఫ్యాన్స్ ఎత్తుకున్న అంశం ఏంటంటే.. సలార్ సినిమా 2 భాగాలుగా వస్తోందట. మొదటి భాగం ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో థియేటర్లలోకి వచ్చి, రెండో భాగం 2023 సమ్మర్ కు వస్తుందనేది వీళ్ల కొత్త ప్రచారం. దీంతో సలార్ సినిమా ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. చివరికి ఈ ప్రచారం ఏ స్థాయికి చేరుకుందంటే, కొంతమంది సోషల్ మీడియా ప్రముఖులు కూడా ఈ విషయాన్ని హైలెట్ చేయడం స్టార్ట్ చేశారు.

మేకర్స్ మాత్రం దీనిపై స్పందించలేదు. శృతిహాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెప్పిన యూనిట్.. రెండు భాగాలుగా సలార్ వస్తుందనే మేటర్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. నిజానికి ఈ గాసిప్ పుట్టడం వెనక ఇంట్రెస్టింగ్ లాజిక్ ఉంది.

సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇతడు కేజీఎఫ్ ను 2 భాగాలుగా తీశాడు. ఇక సలార్ హీరో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా రెండు భాగాలుగా వచ్చింది. సో.. ప్రభాస్-ప్రశాంత్ కలిసి తీస్తున్న సలార్ కూడా రెండు భాగాలుగా వచ్చే అవకాశం ఉందనేది ప్రభాస్ ఫ్యాన్స్ విశ్లేషణ.

అయితే ఇది గాసిప్ వరకే పరిమితమా లేక నిజంగానే సలార్ రెండు భాగాలుగా వస్తుందా అనే మేటర్ పై మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. శృతిహాసన్ చెప్పిన వివరాల ప్రకారం, సలార్ సినిమా దాదాపు 60శాతం షూటింగ్ పూర్తిచేసుకుందట. ఇందులో ఆమె ఆద్య అనే పాత్రలో కనిపించబోతోంది. ఇదొక జర్నలిస్ట్ పాత్ర అని టాక్.