కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడడానికి బీజేపీ నాయకురాలు విజయశాంతి ఎదురు చూస్తూ ఉంటారు. ఏ మాత్రం అవకాశం చిక్కినా విజయశాంతి దూకుడు ప్రదర్శిస్తుంటారు. తాజాగా మంత్రి కేటీఆర్పై సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే సెటైర్ విసిరారు. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో విజయశాంతి ఫైర్ అయ్యారు.
ఓ సామెత తీసుకుని ఫేస్బుక్లో సందర్భోచితంగా ఆమె పోస్ట్ పెట్టారు. ఇందులో కేటీఆర్పై వ్యంగ్యోక్తులు విసిరారు.
‘అమ్మకు అన్నం పెట్టనోడు… పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడని… తెలంగాణలో తరచుగా వినిపించే సామెత. సరిగ్గా టీఆర్ఎస్ నేతలు కూడా అదే బాటలో పయనిస్తున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతోంది. విశాఖపట్టణంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ అవసరమైతే అక్కడికెళ్ళి నేరుగా ఉద్యమంలో పాల్గొంటామంటూ కేంద్రంపై చిర్రుబుర్రులాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ కుటుంబం ఎలాంటి హామీలిచ్చిందో ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది.
ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో మూతపడిన తెలంగాణలోని నిజాం షుగర్స్, ఆజంజాహి మిల్స్, ఆల్విన్ కంపెనీ, ప్రాగా టూల్స్ లాంటి పలు కంపెనీలను వంద రోజుల్లో తెరిపించి ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చారు. ఇప్పుడు మాటమాత్రంగానైనా వాటి ప్రస్తావన చెయ్యడం లేదు.
ఇంతకీ ఇదంతా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్ల కోసం మాటలే తప్ప, ఈ దొర కుటుంబపు అసలు ధోరణి ఆంధ్ర ప్రాంత ప్రజలపై ఎంత అసభ్యకరంగా… అవమానించే ధోరణిలో, బూతు మాటలతో కూడి ఉంటుందో ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే, వీరి ప్రస్తుత ప్రకటనలను సమర్థిస్తున్న ఆయా నేతలు కొందరికి సరిగ్గా అర్థం అవుతుంది’ అని రాములమ్మ తనదైన శైలిలో పంచ్లు విసిరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్పై కేటీఆర్ ప్రేమ వెనుక కారణాలేంటో విజయశాంతి అరటి పండు వలిచినట్టు వివరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంధ్రా ఓటర్ల మనసు గెలుచుకునేందుకు కేటీఆర్ విశాఖ స్టీల్ అంశాన్ని లేవనెత్తితే, దాన్ని తిప్పి కొడుతూ విజయశాంతి పోస్ట్ పెట్టడం గమనార్హం.