పేరుకి మాత్రం స్నేహితుడు.. గుండెల నిండా కక్ష

గోపాలకృష్ణ, బ్రహ్మయ్య ఇద్దరూ ఫ్రెండ్స్. రోజూ పలకరించుకుంటారు, పార్టీలు కూడా చేసుకుంటారు. కానీ బ్రహ్మయ్య మనసులో తనను చంపేసేంత కసి దాగుందని గోపాలకృష్ణ గుర్తించలేకపోయాడు. పార్టీకి పిలిచి మరీ ప్రాణాలు కోల్పోయాడు. విశాఖ సాగరతీరంలో…

గోపాలకృష్ణ, బ్రహ్మయ్య ఇద్దరూ ఫ్రెండ్స్. రోజూ పలకరించుకుంటారు, పార్టీలు కూడా చేసుకుంటారు. కానీ బ్రహ్మయ్య మనసులో తనను చంపేసేంత కసి దాగుందని గోపాలకృష్ణ గుర్తించలేకపోయాడు. పార్టీకి పిలిచి మరీ ప్రాణాలు కోల్పోయాడు. విశాఖ సాగరతీరంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గోపాలకృష్ణ విశాఖపట్నంలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సైట్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. బీచ్ రోడ్ లో ఉన్న ప్రతిమ అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడు. ఇతడికి అదే ప్రాంతానికి చెందిన ఓ హోటల్ యజమాని బ్రహ్మయ్యతో చాన్నాళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరూ రెగ్యులర్ గా కలుసుకుంటారు.

ఈ క్రమంలో నిన్న సాయంత్రం కూడా గోపాలకృష్ణ ఫ్లాట్ కు వచ్చాడు బ్రహ్మయ్య. వీళ్లిద్దరితో పాటు మరో ముగ్గురు కలిసి మద్యం సేవించారు. మాటల సందర్భంలో గోపాలకృష్ణ-బ్రహ్మయ్య మధ్య పాత వ్యాపార లావాదేవీలు బయటపడ్డాయి. ఆ కోపాన్ని ఎప్పట్నుంచో మనసులో పెట్టుకొని, పైకి ఏమీ తెలియనట్టు ప్రవరిస్తున్న బ్రహ్మయ్య, మద్యం మత్తులో ఆవేశానికి లోనయ్యాడు.

వంటింట్లోకి వెళ్లి చాకు తెచ్చి గోపాలకృష్ణ పొట్టలో పొడిచాడు బ్రహ్మయ్య. దీంతో గోపాలకృష్ణ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కేజీహెచ్ కు తీసుకెళ్లినప్పటికీ  ప్రాణాలు దక్కలేదు. 

జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కత్తితో పొడిచిన బ్రహ్మయ్యతో పాటు అతడితో పాటు మద్యం సేవించడానికి వచ్చిన మరో ఇద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.