కరోనా మహమ్మారితో వ్యవహారం మళ్లీ మొదటికొస్తోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. కరోనా సెకెండ్ వేవ్తో పరిస్థితులు మారుతున్నాయి. తెలంగాణలో రేపటి నుంచి విద్యాసంస్థల మూసివేతకు కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రకటించారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాత్కాలికంగా విద్యాసంస్థలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు. వైద్యారోగ్యశాఖ పదో తరగతి వరకు విద్యా సంస్థలను మూసివేయాలని కేసీఆర్ సర్కార్కు ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం పదో తరగతి వరకే పరిమితం కాకుండా అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఆన్లైన్ క్లాస్లు యథావిధిగా కొనసాగుతాయని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. మెడికల్ కాలేజీలు యథావిధిగా నడుస్తాయన్నారు.
ఇదే సందర్భంలో కేంద్రం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా ఏప్రిల్ నెలాఖరు వరకూ కోవిడ్ నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ తప్పనిసరిగా పాటించాలని పునరుద్ఘాటించింది. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.
ఆర్టీపీసీఆర్ టెస్టులను 70శాతానికి పెరిగేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలను కట్టడి ప్రాంతాలుగా ప్రకటించాలని రాష్ట్రాలను ఆదేశించింది. మాస్కులు, శానిటైజర్ వినియోగం పెరిగేలా ప్రజలను చైతన్య పరచాలని ప్రభుత్వాలను ఆదేశించింది.
మాస్కుల ధరించని వారిపై జరిమానా కూడా విధించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ తప్పదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని ప్రజల్లో చర్చ జరుగుతోంది. శ్యాడ్ డేస్ను జనం గుర్తు చేసుకుంటున్నారు.