కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంకాగాంధీకి దేశ వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఇటీవల తన అన్న రాహుల్తో కలిసి ఆమె హథ్రాస్లో హత్యాచారానికి గురైన బాధిత యువతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న క్రమంలో అవాంఛనీయ ఘటన చోటు చేసుకొంది.
ప్రియాంకాగాంధీ కుర్తా పట్టుకుని గౌతమ్బుద్ధనగర్ పోలీసు అధికారి లాగారు. పోలీసు అధికారి దుష్ర్పవర్తనపై దేశ వ్యాప్తంగా నిరసన ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ప్రియాంకాగాంధీకి అనూహ్యంగా మహారాష్ట్ర బీజేపీ నాయకురాలు చిత్ర వాఘ్ మద్దతుగా నిలిచారు.
సదరు పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ను ఆమె డిమాండ్ చేశారు. మహిళా రాజకీయ నాయకురాలిపై చేయి వేయడానికి ఆ మగ పోలీసు అధికారికి ఎంత ధైర్యమని చిత్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పరిమితులేంటో తెలుసుకుని పోలీసులు ప్రవర్తించాలని ఆమె హితవు చెబుతూ ఈ మేరకు ట్వీట్ చేశారు.
మహిళలతో అభ్యంతరకరంగా వ్యవహరించడం భారతీయ సంప్రదాయం కాదని ఆమె పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిపై పూర్తి విశ్వాసం ఉన్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దుష్ప్రవర్తన కలిగిన సదరు పోలీసు అధికారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ మేరకు తన ట్వీట్కు ప్రియాంకా గాంధీ కుర్తా లాగుతున్న ఫొటోను షేర్ చేశారు. బీజేపీ మహిళా నాయకురాలి ట్వీట్ సొంత పార్టీని ఇరుకున పెట్టేలా ఉంది. దీంతో ఆ పార్టీ నేతలు నోరు మెదపడం లేదు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం చిత్ర సంస్కారాన్ని ప్రశంసించడం విశేషం.