ఎన్నికల కమిషనర్ నియామకంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా ఆ వ్యాఖ్యలున్నాయి. గోవా ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా ఆ రాష్ట్ర న్యాయ కార్యదర్శికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. దీనిపై బాంబే హైకోర్టు స్టే ఇచ్చింది.
ఈ నేపథ్యంలో వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్ ఆర్ ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో రాష్ట్రం జోక్యం చేసుకోకూడదని రాజ్యంగంలో పొందుపరిచిన విషయాన్ని సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసింది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ అధికారులను ఎన్నికల కమిషనర్లగా నియమించడంపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.
కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం ఉన్న అధికారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పని చేయకూడదని తేల్చి చెప్పింది. ఎస్ఈసీగా స్వతంత్రగల వ్యక్తి ఉండాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అలాగే గోవా పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి 10 రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
ఏప్రిల్ 30 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని గోవా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం గమనార్హం. ఏపీలో ఎస్ఈసీ తొలగింపు, ఆ తర్వాత న్యాయస్థానాల ఆదేశాల మేరకు నియమించిన నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.