బావ తేతలి సత్తిరాజురెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసులో ఆయన బామ్మర్ది, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజురెడ్డి చాలా కాలంగా భార్య విజయలక్ష్మి, బిడ్డల్ని వదలిపెట్టి మరో మహిళతో సహ జీవనం సాగించాడు. ఈ క్రమంలో ఆయన అనుమానాస్పద స్థితిలో రెండు నెలల క్రితం మృతి చెందాడు. ఈ నేపథ్యంలో సత్తిరాజురెడ్డి మృతికి వారి కుటుంబ సభ్యులే కారణమంటూ సహజీవనం సాగించిన మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతేకాదు మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కాకుండా, ఆయన సహజీవనం చేస్తున్న మహిళకు అప్పగించారు. దీనిపై అప్పట్లో పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. రాజకీయ ప్రయోజనాల కోసమే తమ కుటుంబంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని రామకృష్ణారెడ్డి సోదరి, సత్తిరాజురెడ్డి భార్య విజయలక్ష్మి ఆరోపించారు. తన భర్త సత్తిరాజురెడ్డి తాను కొన్ని విభేదాల కారణంగా విడిగా ఉంటున్నామని, ఇప్పటి వరకు తాము విడాకులు తీసుకోలేదని అప్పట్లో ఆమె వెల్లడించారు.
తన భర్త మృతికి తన సోదరుడు రామకృష్ణారెడ్డి, మరదలు మహాలక్ష్మిలు కారణమంటూ పోలీసులు కేసునమోదు చేయడం సమంజసం కాదని, ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోందని అప్పట్లో ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే.
అనపర్తి మండలం రామవరంలో హైకోర్టు న్యాయవాది శివారెడ్డి ఇంటి వద్ద ఉన్న సమయంలో టీడీపీ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ నాయకుడి అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.