గత ఐదేళ్లలో అధికారంలో ఉంటూ జనాన్ని వంచించిన టీడీపీ…ప్రతిపక్షంలో కూడా ఆ గుణాన్ని మార్చుకోవడం లేదు. ఇప్పుడు జనంతో పాటు తమను తాము వంచించుకుంటున్నారు. తమ ఘోర పరాజయానికి కారణాలపై ఇప్పటికీ టీడీపీ ఆత్మ పరిశీలన చేసుకోలేదు. ఆ పనిచేయకపోగా ఆత్మస్తుతి, పరనిందకు పాల్పడుతోంది.
వైసీపీ ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయింది. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలు, అరాచకాలను తొమ్మిది విభాగాలుగా వర్గీకరించి ‘విధ్వంసానికి ఒక్క చాన్స్’ శీర్షికతో 20 పేజీల చార్జిషీట్ టీడీపీ తయారు చేసింది. దీన్ని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, వర్ల రామయ్య, బొండా ఉమా, కొల్లు రవీంద్ర, అశోక్బాబు విడుదల చేశారు. ఈ రచన టీడీపీ విధ్వంస ఆలోచన ధోరణులను ప్రతిబింబిస్తోంది.
జగన్ పాలనలో మాట తప్పాడని, మడమ తిప్పాడని ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. ఇందులో భాగంగా పేర్కొన్న అంశాలను ప్రస్తావిద్దాం. ‘రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.13.5 వేలు ఇస్తామని చెప్పి, కేంద్రం డబ్బుతో కలిపి ఇస్తున్నారు. పింఛను రూ.3 వేలు చేస్తామని, రూ.250 మాత్రమే పెంచారు. రైతులకు సున్నా వడ్డీ కింద రూ. 4 వేల కోట్లు ఇస్తామని, ఇంతవరకూ పైసా ఇవ్వలేదు. డ్వాక్రా రుణ మాఫీ చేస్తామని చెప్పి, తొలి ఏడాది పైసా కూడా చేయలేదు. ప్రతి విద్యార్థికి అమ్మఒడి అని, ఇంటికి ఒకరికే పరిమితం చేశారు’
అసలు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి…ఐదేళ్ల పాలనలో ఆ పనిచేయని వాళ్లకు…ఇప్పుడు జగన్ సర్కార్ను విమర్శించే నైతిక హక్కు ఉందా? ఇంకా రెండు కంతులు చెల్లించకుండానే, ఎన్నికల సమయంలో జీవోలు ఇచ్చి మభ్యపెట్టాలని చూసిన బాబు సర్కార్కు రైతులు బాగా వాత పెట్టారు. ఇప్పుడు జగన్ సర్కార్ రైతు భరోసాను ప్రతిరైతుకు అందిస్తోంది. అంతేకాదు, నాలుగేళ్లు అని హామీ ఇచ్చినప్పటికీ మరో ఏడాది కూడా ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. టీడీపీకి ఇవేవీ కనిపించవు, వినిపించవు.
ఇక పింఛన్ విషయానికి వస్తే…జగన్ మొదటి నుంచి ఒకే మాట చెబుతూ వస్తున్నారు. పింఛన్ను అంచెలంచెలుగా రూ.3 వేలకు పెంచుతూ పోతానని హామీ ఇచ్చారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నెరవేర్చిన మొట్ట మొదటి హామీ అదే. బహుశా వచ్చే నెలలో మరో 250 రూపాయలు పెంచి పింఛన్ను రూ.2.500కు పెంచే అవకాశం ఉంది. అలాంటప్పుడు జగన్ మోసగించిందెక్కడ?
నాలుగేళ్లలో డ్వాక్రా రుణ మాఫీ చేస్తామని జగన్ చెప్పారు. సంక్షేమ క్యాలెండర్లో డ్వాక్రా రుణమాఫీ మొదటి విడత సొమ్ము సెప్టెంబర్లో బ్యాంకులకు జమ చేయనున్నట్టు స్పష్టంగా తెలిపారు. ఇక టీడీపీకి వచ్చిన ఇబ్బంది ఏమిటి? అమరావతి అంటే ఆంధ్రుల కలల రాజధాని ఎంత మాత్రం కాదు. అది కేవలం ఎల్లో బ్యాచ్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం. అందువల్లే రాజధాని తరలింపుపై నిరసనకు బదులుగా మద్దతు లభించింది.
ఒకవైపు ఏమీ చేయలేదంటూ సున్నా ముఖ్యమంత్రి అంటూనే…మరోవైపు తమ పథకాలనే పేర్లు మార్చి అమలు చేస్తున్నారని టీడీపీ చెప్పడం ఏంటి? ఇది ఆత్మవంచన కాదా? సంక్షేమ పథకాల్లో అమల్లో జగన్ జనంలో తిరుగులేని ముద్ర వేయగలిగారు. మాట ఇస్తే మడమ తిప్పడనే భరోసాను నింపారు.
అందులోనూ కరోనా లాంటి విపత్తులోనూ జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో ప్రజల మెప్పును పొందగలుగుతున్నారు. వీటన్నింటిని విస్మరించి తమకు అనుకూలమైన అంశాలపై విమర్శించడం టీడీపీకే చెల్లింది. కానీ నిజాలేంటో జనానికి బాగా తెలుసు.