మటన్ తో పోటీ పడుతున్న చికెన్

చికెన్ రేట్లు పెరగడం కొత్తేంకాదు. వేసవి వచ్చిందంటే ధర కాస్త పెరుగుతుంది. కానీ ఈ వేసవి అలాంటిలాంటిది కాదు. ఎండలు మండిపోతున్నాయి. దీంతో చికెన్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. మూడేళ్ల గరిష్ఠ ధరకు చేరుకున్నాయి. ప్రస్తుతం…

చికెన్ రేట్లు పెరగడం కొత్తేంకాదు. వేసవి వచ్చిందంటే ధర కాస్త పెరుగుతుంది. కానీ ఈ వేసవి అలాంటిలాంటిది కాదు. ఎండలు మండిపోతున్నాయి. దీంతో చికెన్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. మూడేళ్ల గరిష్ఠ ధరకు చేరుకున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కిలో చికెన్ ధర 300 రూపాయలకు చేరుకుంది.

వారం కిందటి వరకు కిలో చికెన్ 250 రూపాయలుండేది. అదే ఎక్కువ అనుకుంటున్న టైమ్ లో, 4-5 రోజుల్లోనే 300 కు చేరింది రేటు. పెరిగిపోతున్న ఎండలే చికెన్ ధర పెరగడానికి కారణం.

పెరుగుతున్న ఎండలు..మెయింటెనెన్స్ కష్టాలు..

ఎండ వేడిమికి కోళ్లు చనిపోతున్నాయి, దీంతో చికెన్ లభ్యత తగ్గిపోతోంది. మరోవైపు కోళ్ల ఫారాల్లో కూలర్లు, స్ప్రింకర్లు, రెయిన్ డ్రిప్ లాంటివి పెడుతున్నారు వ్యాపారాలు. దీంతో నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి. మరోవైపు మొక్కజొన్న, సోయా లాంటి దానా ఖర్చులు కూడా పెరగడంతో.. చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి.

ప్రస్తుతం మార్కెట్లో స్కిన్ లెస్ చికెన్ ధర 320 రూపాయల వరకు ఉంది. అదే బోన్ లెస్ చికెన్ కావాలంటే కిలోకు ఏకంగా 550 రూపాయలు పెట్టాల్సిందే. ఇక నాటుకోడి విషయానికొస్తే.. కిలో 380 నుంచి 400 రూపాయలకు ఉంటోంది. దీని బదులు అరకిలో మటన్ కొనుక్కోవడం బెటర్ అంటున్నారు వినియోగదారులు.

తెలంగాణలో ఫంక్షన్లు ఎక్కువగా జరుగుతుండడంతో, చికెన్ విక్రయాలు పెరిగి, గిరాకీ పెరిగినట్టు వ్యాపారాలు చెబుతున్నారు. ఈ డిమాండ్ కు తగ్గట్టు లభ్యత లేకపోవడం వల్ల చికెన్ రేట్లు పెరుగుతున్నాయి. మరో వారం రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడ్డంతో, వారం తర్వాత చికెన్ ధరలు తగ్గే అవకాశం ఉంది. అటు చికెన్ ధరతో పాటు కోడి గుడ్డు ధర కూడా స్వల్పంగా పెరిగింది.