అంతా చెత్త.. లిస్ట్ లోకి మరిన్ని రెస్టారెంట్లు

గొప్ప అనుకున్న రెస్టారెంట్లలో ఉన్న చెత్తను బయటకు తీస్తోంది ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్. కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని పలు ఫేమస్ రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, వాటి అసలు స్వరూపాన్ని ప్రజలకు…

గొప్ప అనుకున్న రెస్టారెంట్లలో ఉన్న చెత్తను బయటకు తీస్తోంది ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్. కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని పలు ఫేమస్ రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, వాటి అసలు స్వరూపాన్ని ప్రజలకు చూపిస్తోంది.

పైకి జిగేల్ మనిపించే లైట్లు, ఆకట్టుకునే ఫర్నిచర్, ఏసీ పెట్టి… లోపల కిచెన్ నుంచి మాత్రం పాడైపోయిన ఆహారాన్ని తెచ్చి వడ్డిస్తున్న కొన్ని హోటళ్ల బాగోతాన్ని బయటపెట్టింది టాస్క్ ఫోర్స్. తాజాగా ఈ లిస్ట్ లోకి మరిన్ని రెస్టారెంట్లు చేరాయి.

అత్తాపూర్ లోని పటేల్ హోటల్ లో ఓ కస్టమర్ కు చేదు అనుభవం ఎదురైంది. బిర్యానీ తింటుంటే అందులోకి సూతిన్ దారం వచ్చింది. వెంటనే జీహెచ్ఎంసీకి ట్యాగ్ చేశాడు. అధికారులు ఆకస్మికంగా దాడి చేసి, రెస్టారెంట్ లో గడువు దాటిన కొన్ని ఆహార పదార్థాల్ని అక్కడికక్కడే చెత్త బుట్టలో వేశారు.

హైటెక్ సిటీ పరిథిలోని కార్బ్ అండ్ కిటో రెస్టారెంట్ లో ఓ యువతికి ఆహారంలో బొద్దింక వచ్చింది. దీంతో ఆమె ఫిర్యాదుచేయగా, అధికారులు హోటల్ ను తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన ఫుడ్ శాంపిల్స్ ను పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించారు.

షాద్ నగర్ లో మరీ దారుణం. మండి బిర్యానీ తిన్న ఓ కుటుంబం ఆస్పత్రి పాలైంది. ఇందులో ఒకరికి ఏకంగా రక్తపు వాంతులు అవ్వడంతో పరిస్థితి సీరియస్ గా మారింది. అతడ్ని ఐసీయూలో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు.

టాస్క్ ఫోర్స్ చేస్తున్న దాడులపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం దాడులతోనే ఆపేయకుండా.. అలాంటి రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.