డ్రమ్ లో డెడ్ బాడీ.. కేసు ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన 'డ్రమ్ లో డెడ్ బాడీ' కేసును పోలీసులు సక్సెస్ ఫుల్ గా ఛేదించారు. కొన్ని రోజుల కిందట తుక్కుగూడలోని సూరం చెరువులో తేలుతున్న ఓ డ్రమ్ ను అందులో…

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన 'డ్రమ్ లో డెడ్ బాడీ' కేసును పోలీసులు సక్సెస్ ఫుల్ గా ఛేదించారు. కొన్ని రోజుల కిందట తుక్కుగూడలోని సూరం చెరువులో తేలుతున్న ఓ డ్రమ్ ను అందులో ఉన్న ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. విచారణ చేసి, ఆ మృతదేహం పురాన్ సింగ్ దిగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు.

ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన పురాన్ సింగ్, జయదేవి ప్రేమించుకున్నారు. కొన్నాళ్ల పాటు వీళ్ల ప్రేమ వ్యవహారం బాగానే సాగింది. ఆ తర్వాత అభిప్రాయబేధాలొచ్చాయి. దీంతో జయదేవితో ఉన్న రిలేషన్ షిప్ ను కట్ చేసుకున్నాడు పురాన్ సింగ్.

ఆ తర్వాత వృత్తి రీత్యా హైదరాబాద్ వచ్చేశాడు. స్థానికంగా పానీ పూరి బండి పెట్టుకున్నాడు. అదే టైమ్ లో పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే జయదేవికి మాత్రం ఆ కోపం అలానే ఉండిపోయింది. తనను వదిలేసిన పురాన్ సింగ్ ను అంతం చేయాలని ఆమె నిర్ణయించుకుంది.

కేవలం అదే లక్ష్యంతో హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో నజీమ్ అనే వ్యక్తిని ప్రేమించింది. తన పాత ప్రేమ వ్యవహారం, కక్ష మొత్తాన్ని నజీమ్ కు చెప్పింది. ప్రేయసి కళ్లలో ఆనందం కోసం, పురాన్ సింగ్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు నజీమ్. దీని కోసం తన స్నేహితుడు సుగుణ్ రామ్ హెల్ప్ తీసుకున్నాడు.

మైనర్ బాలుడి సహాయంతో..  పురాన్ సింగ్ ను పక్కకుతీసుకొచ్చి, కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత నజీమ్, సుగుణ్ రామ్, జయదేవి కలిసి పురాన్ సింగ్ ను హత్య చేసి, డ్రమ్ములో కుక్కి చెరువులో పడేశారు. విచారణలో హత్య చేసింది మాజీ ప్రేయసి అనే విషయం తెలుసుకున్న పోలీసులు, ముగ్గుర్నీ అదుపులోకి తీసుకున్నారు.