కాంగ్రెసులో కంగారు పుట్టించిన కేసీఆర్!

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన అమ్ముల పొదిలో నుంచి ఒక్కొక్క కీలకమైన అస్త్రాన్ని బయటకు తీస్తున్నట్లుగా కనిపిస్తోంది.  Advertisement ఇటీవల కాలంలో ఉద్యోగులకు కొత్త పిఆర్సి…

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన అమ్ముల పొదిలో నుంచి ఒక్కొక్క కీలకమైన అస్త్రాన్ని బయటకు తీస్తున్నట్లుగా కనిపిస్తోంది. 

ఇటీవల కాలంలో ఉద్యోగులకు కొత్త పిఆర్సి కమిటీ వేయడంతో సహా అనేక కీలక ప్రకటనలు చేస్తూ వస్తున్న కేసీఆర్ తాజాగా రైతు లోకం పై మరో బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. రైతు రుణమాఫీని తక్షణమే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

రుణమాఫీ కి సంబంధించిన ఈ ప్రకటన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కంగారు పుట్టిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే రుణమాఫీ అనేది జరిగినప్పటికీ కూడా దానికి సంబంధించిన క్రెడిట్ ఇసుమంతైనా కేసీఆర్ ఖాతాలోకి వెళ్లకుండా ఉండేందుకు కాంగ్రెస్ నాయకులు ఒక వ్యూహాత్మక ప్రచారాన్ని ఇప్పటినుంచి ప్రారంభిస్తున్నారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం అని అభివర్ణించడం చోద్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అనేక ఉద్యమాలు పోరాటాల ద్వారా ఒత్తిడి చేసిన ఫలితంగానే ఇవాళ రుణమాఫీకి నిర్ణయం తీసుకున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ఇటీవల కలసి రుణమాఫీ గురించి డిమాండ్ చేసిన వైనం కూడా ఆయన గుర్తు చేస్తున్నారు.

‘సక్సెస్ హేజ్ మెనీ ఫాదర్స్’ అనే సామెత చందంగా ప్రజలకు మేలు చేసే ఒక మంచి పని జరుగుతున్నది అంటే దానికి సంబంధించిన క్రెడిట్ తమకంటే తమకు దక్కాలని రాజకీయ పార్టీలు పోటీపడుతుండడం చాలా సహజం. ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన రైతు రుణమాఫీ హామీ విషయంలో కూడా అదే జరుగుతోంది. కేసీఆర్ ఇచ్చిన హామీని కాస్త ఆలస్యంగా అయినా ఆయనే అమలులోకి తీసుకు వస్తున్నప్పటికీ మధ్యలో కీర్తి మాత్రం తమకు దక్కాలని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతున్నది. నాలుగేళ్ల పాటు రుణమాఫీ జరగలేదంటే ఆ పాపం కేసిఆర్ ప్రభుత్వానిదే అని రేవంత్ రెడ్డి నిందిస్తున్నారు.

ఎన్నికలు అత్యంత సమీపంలో ఉన్న ఈ తరుణంలో కేసీఆర్ రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజాకర్షక పథకాలను ప్రకటించే అవకాశం కూడా ఉంది. అలాంటి అన్ని హామీల విషయంలోనూ తమ పోరాటాల ఫలితమే అని కాంగ్రెస్ ప్రకటించుకుంటుందా? కేసీఆర్ సర్కారు ఏ మంచి పని చేసినా ఆ కీర్తిలో తమకు వాటా ఉందని వారు కొట్లాడుతారా? అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.