తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దాడులు జరగడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంగా వున్నారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్తకోట ప్రభాకర్రెడ్డిపై దాడినే జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్, గత రాత్రి అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ శ్రేణులు దాడిని సీరియస్గా తీసుకుంది.
ఈ సందర్భంగా ప్రత్యర్థులకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజును మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడో సారి అధికారంలోకి వచ్చేది తామే అని ధీమాగా చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకుంటామని కేటీఆర్ గట్టి హెచ్చరిక చేశారు.
బాలరాజు ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన కోరారు. ప్రజాప్రతినిధులకు భద్రత పెంచాలని డీజీపీని కోరుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంవీకృష్ణ తన అనుచరులతో కలిసి గువ్వల బాలరాజుపై దాడి చేశారని మంత్రి ఆరోపించారు.
గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతి లేదన్నారు. దాడుల సంస్కృతి మంచిదికాదని మంత్రి అన్నారు. బాలరాజు భార్యను కూడా కించపరిచేలా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆయన తప్పు పట్టారు. అణగారిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు.