గులాబీలకు కరెంటు షాక్!

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారంగా తాము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. అలాగే,…

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారంగా తాము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. అలాగే, ఆరోగ్యశ్రీని పదిలక్షలకు పెంచారు. ఆరు గ్యారంటీల్లో మిగిలిన కొంత గ్యాప్ వచ్చింది. వంద రోజుల్లోగా తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమల్లోకి తెస్తాం అని రేవంత్ ప్రకటించారు కూడా.

అయినాసరే, ఈలోగా గులాబీ దళం తాళలేకపోయింది. ఆరు గ్యారంటీలకు చావు వార్త వినాల్సి వస్తుందని, ఆ విషయంలో రేవంత్ సర్కారు మోసం చేస్తోందని, అవి అమలు అయ్యేది లేదని, లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే దాకా సాగదీసి ఆ తర్వాత ఇంకో రెండు మూడు నెలలు వాయిదా వేస్తారని రకరకాలుగా విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వం తరఫు నుంచి వంద రోజుల మాట అంటూనే ఉన్నప్పటికీ గులాబీ విమర్శలు మాత్రం ఆగనేలేదు. ఆలస్యం అవుతున్న కొద్దీ గులాబీదళాలు రెచ్చిపోతూ వచ్చాయి.

ఆరు గ్యారంటీల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేద్దామని,పెట్టేస్తున్నామని మురిసిపోతున్న గులాబీదళాలకు రేవంత్ ప్రభుత్వం కరెంటు షాక్ ఇచ్చింది. 200 యూనిట్లు దాటని వారికి ఉచిత విద్యుత్తు హామీని ఫిబ్రవరి నెల నుంచి అమలు చేస్తాం అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ప్రకటించారు.

గాంధీభవన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం తర్వాత.. ఆయన ఈ ప్రకటన చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి తీరుతాం అని కోమటిరెడ్డి ఈ సందర్భంగా ప్రకటించడం విశేషం. వందరోజల్లో అన్నీ కార్యరూపంలోకి వస్తాయని మరోసారి చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో అత్యంత కీలకమైన వాటిలో.. 200 యూనిట్లు దాటని ప్రతి ఇంటికీ కరెంటు ఉచితంగా ఇవ్వడంతో పాటు, 500 కే గ్యాస్ సిలిండరు ఇవ్వడం కూడా ఉంది. అయితే ఈ పథకాలను మొత్తం ప్రజలందరికీ అందిస్తారా లేదా, ఈ పథకాలను తెల్ల రేషన్ కార్డుకు ముడిపెడతారా? అనేది మాత్రం స్పష్టత రాలేదు. అర్హుల ఎంపికకు మరోవైపు ప్రభుత్వం కసరత్తు కూడా ప్రారంభించింది. ఈ గ్యాప్ లోనే ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించేందుకు భారాస శ్రేణులు, నాయకులు రెచ్చిపోయారు. 

ఈ నెలలో కరెంటు బిల్లులు కట్టొద్దు అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపు ఇవ్వడం కూడా జరిగింది. నిజానికి ఎన్నికల ప్రచార సమయంలోనే రేవంత్ రెడ్డి ఆ తర్వాతినెలలో కరెంటు బిల్లులు కట్టొద్దు అని పిలుపు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక టెక్నికల్ గా ఏర్పాట్లు చేయడానికే కొంత ఆలస్యం అయినట్టు కనిపిస్తోంది.

ఫిబ్రవరి నుంచి ఉచిత కరెంటు అమల్లోకి వస్తుందని మంత్రి ప్రకటించడంతో.. గులాబీ శ్రేణుల నోర్లకు తాళాలు వేసినట్లు అయింది. విమర్శలతో విరుచుకుపడుతున్న వారికి కరెంటు షాక్ గట్టిగానే తగిలిందని ప్రజలు అంటున్నారు.