వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా ఆమె వడివడిగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో షర్మిల భేటీ అయ్యారు. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంపై ఫైనల్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఒకవైపు రేవంత్ రెడ్డి వర్గం షర్మిల రాకను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు షర్మిల మాత్రం తన పార్టీ కార్యకర్తల అభిప్రాయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పాలేరు నుండి ఎన్నికల బరిలోకి దిగనున్నారని ప్రచారం జరుగుతోంది. ఏదీ ఏమైనప్పటికీ ఈ వారంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశమున్నట్లు సమాచారం.
కాగా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ టీడీపీ, ఒరిజినల్ కాంగ్రెస్ అనే రెండు గ్రూప్లుగా విడిపోయిన సంగతి తెలిసిందే. షర్మిల చేరికతో తెలంగాణ కాంగ్రెస్లో గ్రూపుల గొడవ మరింత పెరిగే అవకాశం వుంది. వైఎస్సార్ గ్రూప్ బలోపేతం కానుంది. తెలంగాణలో వైఎస్సార్ మనుషులుగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ నాయకులకు కొరత లేదు. షర్మిల రాక టీడీపీ అనుకూల కాంగ్రెస్ నాయకులకు నచ్చకపోగా, ఇతర నాయకుల్లో మాత్రం ఆనందం కనిపిస్తోంది. తెలంగాణలో షర్మిల రాకను అడ్డు పెట్టుకుని ప్రత్యర్థులు ఏ విధంగా రాజకీయాలు చేస్తారో చూడాలి.