తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను పది తలల రావణాసురుడితో బీజేపీ నాయకురాలు విజయశాంతి పోల్చారు. బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడి నేపథ్యంలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. అర్వింద్ ఇంటిపై దాడి దురదృష్టకర మన్నారు. ముఖ్యమంత్రి… సారీ పది తలల రావణాసుర ముఖ్యమంత్రి అని విజయశాంతి వ్యంగ్యంగా అన్నారు. మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన అసలు బాగుందా? అని కేసీఆర్ను విజయశాంతి ప్రశ్నించడం గమనార్హం.
మీ బుద్ధి వంకరటింకర అని వెటకరించారు. సీఎంగా తెలంగాణకు ఏనాడూ మంచి చేయలేదని విజయశాంతి విమర్శించారు. మీ పరిపాలనలో హత్యలు, మానభంగాలు, అరాచకాలు, దోపిడీలే కదా జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ను ఆమె ప్రశ్నించారు. కనీసం మీ బిడ్డలకైనా మంచి బుద్ధి ఇచ్చి వుంటే బాగుండేదని అనుకుంటున్నామని కేసీఆర్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య చేశారు. ప్రతిపక్ష సభ్యులు ఏదైనా ఒక మాట అంటే చక్కటి సమాధానం చెప్పాలని హితవు చెప్పారు.
జవాబు చెప్పకపోగా, కొట్టి చంపుతామంటే… వీధి రౌడీలకి, కేసీఆర్ బిడ్డకి పెద్దగా తేడా లేదని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని సంస్కారవంతమైన భాష నేర్పితే బాగుంటుందని విజయశాంతి అన్నారు. కొట్టడం, అలాగే కొట్టి చంపుతాననడం ఏంటని ఆమె నిలదీశారు. ముందు కేసీఆరే తన బిడ్డ గురించి మొదలు పెట్టారని గుర్తు చేశారు. ఆ నేపథ్యంలో అర్వింద్ మాట్లాడ్డంలో తప్పేంటని విజయశాంతి నిలదీశారు. అర్వింద్ చేసిన ఆరోపణలపై కేసీఆర్ బిడ్డ కౌంటర్ ఇచ్చి వుంటే సరిపోయేదన్నారు.
ఎంపీ అర్వింద్ తల్లి ఇంట్లో ఒంటరిగా వుంటే ఏ విధంగా దాడులు చేస్తారని విజయశాంతి ప్రశ్నించారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కొంచెం నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బీజేపీ సమాధానం చెప్పదని, యావత్ తెలంగాణ సమాజమే స్పందిస్తుందన్నారు. కేసీఅర్ ఏ భాష వాడారో, తమ పార్టీ కూడా అదే భాష మాట్లాడుతుందని విజయశాంతి తేల్చి చెప్పారు.