ప్రేమించు లేదా చావు: వార్నింగ్ తో అమ్మాయి మృతి

చట్టాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, మరోవైపు సమాజంలో అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, మహిళలపై అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. మొన్నటికిమొన్న ఢిల్లీలో ఓ అమ్మాయిపై యాసిడ్ పోసి దాడిచేశాడు ఓ దుర్మార్గుడు. ఇప్పుడు అలాంటిదే…

చట్టాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ, మరోవైపు సమాజంలో అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, మహిళలపై అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. మొన్నటికిమొన్న ఢిల్లీలో ఓ అమ్మాయిపై యాసిడ్ పోసి దాడిచేశాడు ఓ దుర్మార్గుడు. ఇప్పుడు అలాంటిదే ఓ ఘటన తెలంగాణలో జరిగింది.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అమ్మాయిపై వేధింపులకు పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆత్మహత్య చేసుకోవాలని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. చేసేదేం లేక ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకుంది.

బోయినపల్లి మండలం తలగొండ గ్రామానికి చెందిన త్రిష, ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోంది. అదే కాలేజీకి చెందిన సతీష్ అనే యువకుడు, కొన్ని నెలలుగా ఈ అమ్మాయి వెంట పడుతున్నాడు. త్రిష అతడ్ని ఎంత దూరం పెట్టినా సతీష్ మాత్రం తగ్గలేదు. తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధించడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలో ఏకంగా పురుగుల మందు తీసుకొని త్రిష ఇంటికి వెళ్లాడు సతీష్. తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని లేదంటే, ఈ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని డిమాండ్ చేశాడు. గత్యంతరం లేక త్రిష, ఆ పురుగుల మందు తాగేసింది. అదే టైమ్ లో త్రిష సోదరి అక్కడికి రావడం చూసి సతీష్ పరారయ్యాడు

విషయం తెలుసుకున్న త్రిష సోదరి, వెంటనే ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేసింది. అయితే అప్పటికే త్రిష మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. జరిగిన ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు, సతీష్ కోసం గాలిస్తున్నారు. గతంలో ఓసారి సతీష్ కు వార్నింగ్ ఇచ్చామని, తమ కూతురు వెంట పడొద్దంటూ వేడుకున్నామని, అయినప్పటికీ అతడు మారలేదంటూ త్రిష తల్లిదండ్రులు ఏడుస్తూ చెప్పడం అందర్నీ కలచివేస్తోంది.