ఉప ఎన్నికకు టీఆర్ఎస్ సై అంటోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉప ఎన్నిక ఫలితం ఏ మాత్రం వ్యతిరేకంగా ఉన్నా అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడనుంది. ఇదే సందర్భంలో ఈ ఉప ఎన్నికను రాజకీయంగా లబ్ధి పొందేలా మలుచుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతంలో హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమిపాలు కావడం టీఆర్ఎస్కు గుణపాఠం నేర్పింది.
దీంతో ఉప ఎన్నికల్లో ఓటమి నుంచి టీఆర్ఎస్ కావాల్సినన్ని పాఠాలు నేర్చుకుంది. మునుగోడు ఉప ఎన్నికలో మాత్రం ఓటమి పునరావృతం కాకూడదని గట్టి పట్టుదలతో ఉంది. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని చావు దెబ్బతీసి, రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సమరశంఖం పూరించడానికి టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డనుంది.
ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే ఆలస్యం, వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఇంత వేగంగా రాజీనామాను ఆమోదించడం ద్వారా .... ఉప ఎన్నికకు సిద్ధమనే సంకేతాల్ని టీఆర్ఎస్ పంపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజగోపాల్రెడ్డి రాజీనామాపై కాలయాపన చేసి, అనవసర చర్చకు అవకాశం ఇవ్వకూడదని టీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ఉప ఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్టు ప్రత్యర్థులకు రాజీనామా ఆమోదంతో హెచ్చరిక పంపింది. ఇక ఉప ఎన్నికకు నోటిఫికేషనే ఆలస్యం. తలపడేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సిద్ధంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు చివరి ఉప ఎన్నిక కానుండడంతో తెలంగాణలో ఓ రేంజ్లో రాజకీయ వేడి రగలనుంది.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు