అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జర్నలిస్టుల విషయంలో జగన్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో జగన్ సర్కార్ వివక్ష పుణ్యమా అని జర్నలిస్టులు అక్రిడిటేషన్లు, బస్సు పాసులు, అన్నిటికీ మించి హెల్త్ కార్డులు నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టులపై జగన్ సర్కార్ కక్షపూరిత చర్యలను జనసేన తీవ్ర స్థాయిలో ఎండగట్టింది.
ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన విడుదల చేశారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ విడుదల చేసిన ఆ ప్రకటన సారాంశం ఏంటో తెలుసుకుందాం.
వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు, ఆరోగ్య బీమా కార్డుల జారీ కూడా సక్రమంగా చేపట్టడం లేదు. నిబంధనల పేరుతో వేల మంది రిపోర్టర్లకు అక్రిడిటేషన్ కార్డుల జారీ నిలిపివేశారు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో పట్టణ, మండల విలేకరులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జర్నలిస్టులకు బస్సు పాసులను కూడా దూరం చేసిన ఘనత ఒక్క జగన్ సర్కార్కే దక్కింది.
జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్స్ కూడా అమలు కావడం లేదు. కరోనాతో విపత్తు తలెత్తినా విలేకరులు ప్రాణాలకు తెగించి రిపోర్టింగ్ చేస్తున్నారు. జర్నలిస్టుల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కానీ తన బాధ్యతను జగన్ సర్కార్ విస్మరించింది.
సక్రమంగా హెల్త్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల కరోనా బారిన పడిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఆస్పత్రిపాలై ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇప్పటికే కొందరు జర్నలిస్టులు కరోనాకు బలి అయ్యారు.
ఇప్పటికైనా జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించి , వారి యోగక్షేమాలపై దృష్టి పెట్టాలి. జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వకుండా రాష్ట్ర సమాచారశాఖ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. ఈ ధోరణి చూస్తే సీఎం జగన్, ఆయన కేబినెట్కు విలేకరుల సంక్షేమంపై ఏ మాత్రం బాధ్యత లేదని అర్థమవుతోంది.
జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయంపై జనసేన గొంతెత్తడం ఆహ్వానించ దగ్గ పరిణామం. ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, బస్సు పాసులు, హెల్త్ కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టాల్సి ఉంది.