హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తనదైన స్టైల్లో పంచ్ విసిరారు. హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికలను పురస్కరించుకుని బాలయ్య వరుసగా మూడు రోజులు ప్రచారం నిర్వహించారు. బాలయ్య రోడ్షోలు నిర్వహించారు. కానీ పట్టుమని పది మంది కూడా జనం లేక బాలయ్య రోడ్షోలు వెలవెలబోయాయి.
దీంతో ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో వీడియో తీస్తున్న తన అభిమానిపై ఆయన చేయి చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. బాలయ్య వ్యవహార శైలి మరోసారి రాజకీయ విమర్శలకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో బాలయ్యపై ఎంపీ గోరంట్ల మాధవ్ సెటైర్లు విసిరారు. అనంతపురంలోని 25వ డివిజన్ వైఎస్సార్సీపీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్కు మద్దతుగా గోరంట్ల మాధవ్తో పాటు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ రాత్రి మందు తాగడం.. పగలు ప్రజలను కొట్టడం ఎమ్మెల్యే బాలకృష్ణకు మామూలేనని ఎద్దేవా చేశారు. హిందూపురంలో టీడీపీకి ఓటేసిన పాపానికి అభిమానులు శిక్ష అనుభవించాలా అని ఆయన ప్రశ్నించారు. బాలయ్యపై మాధవ్ ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.