బీజేపీని చూసి టీడీపీ వాతలు పెట్టుకుంటుందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. మొదటి నుంచీ బీజేపీ పంథా మిగిలిన పార్టీల కంటే భిన్నంగా ఉంటోంది. హిందుత్వ ఎజెండాతో ఆ పార్టీ రాజకీయాలు చేయడం తెలిసిందే.
తాజాగా ఏపీలో బీజేపీ ఎజెండాను టీడీపీ ఎందుకు భుజాన ఎత్తుకున్నదో అర్థం కావడం లేదు. తాజాగా రామతీర్థంలోని కొండపై రాముడి విగ్రహాన్ని ఇటీవల దుండగులు ధ్వంసం చేయడం వివాదానికి దారి తీసింది.
సహజంగా ఇలాంటి ఘటనలపై బీజేపీ దూకుడుగా వ్యవహరించాలి. కానీ అందుకు భిన్నంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దూకుడుగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీజేపీ- జనసేన కూటమి కంటే తామెక్కడ వెనుకపడి పోతామో అనే ఆందోళన టీడీపీలో కనిపిస్తోంది.
హిందూ దేవతా విగ్రహాల దాడులను బీజేపీ – జనసేన కూటమి రాజకీయంగా సొమ్ము చేసుకుంటున్నాయని, అది తమ వైపు తిప్పుకోవాలనే క్రమంలో టీడీపీ సరిదిద్దుకోలేని తప్పు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే, లాభమో నష్టమో మొదటి నుంచి బీజేపీ హిందుత్వ ఎజెండాతో ఢిల్లీ నుంచి గల్లీ వరకూ రాజకీయాలు చేస్తోంది. ఈ క్రమంలో లాభనష్టాలు ఆ పార్టీకే చెందుతాయి. ఏపీలో 2024 టార్గెట్గా మిత్రపక్షమైన జనసేనతో కలిసి బీజేపీ ముందుకెళుతోంది.
ఏపీలో హిందూ మతంపై దాడి జరుగుతోందని పదేపదే బీజేపీ విమర్శిస్తోంది. ఈ క్రమంలో రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసంపై బీజేపీ కంటే ముందుగా టీడీపీ స్పందించడం గమనార్హం. ఇంత వరకూ ఏ ఒక్క బీజేపీ నేత కూడా ఆ ఘటనపై సీరియస్గా స్పందించలేదు.
పైపెచ్చు ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్గా స్పందించారు. బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ట్వీట్, ఆ పార్టీ మారిన పంథాను తెలియజేస్తోంది.
వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రజలకు ఎలాగూ రక్షణ లేదని, ఇప్పుడు గుళ్లోని దేవుళ్ల విగ్రహాలకూ రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. జగన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ ధర్మాలకు, సంప్రదాయాలకు కళ్లెం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో దేవుళ్ల విగ్రహాలపై వరుసగా జరుగుతున్న దాడుల నివారణకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రామతీర్థం వెళ్లాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇటీవల నివర్ తుపాను ధాటికి వేల కోట్ల పంట నష్టం జరిగినా రైతులను పరామర్శించని చంద్రబాబు ….తాజాగా మతపరమైన రాజకీయాలను చేయడానికి మాత్రం ఉత్సాహం చూపడం విమర్శలకు దారి తీస్తోంది.
విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో, విజయవాడ కొవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదంలో పదుల సంఖ్యలో మృత్యువాత పడినా ,కనీసం అటువైపు తొంగి చూడని చంద్రబాబు, ఇప్పుడు మాత్రం మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడానికి తహతహలాడుతున్నారనే విమర్శలొస్తున్నాయి.
కానీ చంద్రబాబు మతపరమైన రాజకీయాలు చేయడం వల్ల మైనార్టీ వర్గాల ఓట్లను పూర్తిగా పోగొట్టుకుని నష్టపోతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ హిందుత్వ ఎజెండాతో ఉంటున్న వారు బీజేపీ వైపు మొగ్గు చూపుతారే తప్ప, టీడీపీని ఎంచుకోరని చెబుతున్నారు. హిందువుల పేరుతో ఓటర్లను తన వైపు తిప్పుకోవాలని చంద్రబాబు ఎత్తులు వేయడం కంటే అజ్ఞానం మరొకటి లేదంటున్నారు.