నాలుగేళ్ళలో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 1,20,875 కోట్లు

గడచిన నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి కేంద్ర పన్నులలో వాటా కింద ఆంధ్రప్రదేశ్‌కు లక్షా 20 వేల 875 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి తెలపారు.…

గడచిన నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో కలిపి కేంద్ర పన్నులలో వాటా కింద ఆంధ్రప్రదేశ్‌కు లక్షా 20 వేల 875 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి తెలపారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు, 2018-19 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల వరకు ప్రత్యక్ష పన్నుల కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి వచ్చిన నికర వసూళ్ళు లక్షా 29 వేల 267 కోట్ల రూపాయలని ఆయన తెలిపారు.

ఇది కాకుండా పైన తెలిపిన నాలుగు ఆర్థిక సంవత్సరాలలో జీఎస్టీ కింద ఆంధ్రప్రదేశ్‌ నుంచి వసూలైన మొత్తం లక్షా 11 వేల 312 కోట్ల రూపాయలని చెప్పారు. ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ కింద ఆంధ్రప్రదేశ్‌ నుంచి వసూలైన మొత్తం రెండు లక్షల 40 వేల 579 కోట్ల రూపాయలు. ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం వసూలు చేసిన పన్నులలో ఆంధ్రప్రదేశ్‌ వాటాగా ఇచ్చింది లక్షా 20 వేల 875 కోట్ల రూపాయలని మంత్రి గణాంకాలతో సహా వివరించారు. 

ఏపీలో లక్ష కోట్ల సాగరమాల ప్రాజెక్ట్‌లు

సాగరమాల కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో లక్ష కోట్ల విలువైన 120 ప్రాజెక్ట్‌లను గుర్తించినట్లు రేవులు, షిప్పింగ్‌ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌ వెల్లడించారు. 

వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రాష్ట్రంలో రేవుల చుట్టు పక్కల పారిశ్రామీకరణకు అవసరమైన మౌలిక వసతులను మరింత మెరుగు పరచడం, రేవులను ఆధునీకరించడం, రేవులకు కనెక్టివిటీని అభివృద్ధి చేయడం, కోస్టల్‌ షిప్పింగ్‌, జలరవాణా వ్యవస్థలను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌లను సాగరమాల కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ ప్రాజెక్ట్‌లను వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ రైల్వేస్‌, ఎన్‌హెచ్‌ఏఐ, రాష్ట్ర ప్రభుత్వాలు, మేజర్‌ పోర్ట్‌లు అమలు చేస్తాయని మంత్రి చెప్పారు. సాగరమాల కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో 1380 కోట్ల రూపాయల విలువైన 12 ప్రాజెక్ట్‌లు చేపట్టడం జరిగింది. 

అందులో 754 కోట్ల రూపాయల విలువైన 5 ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి. 316 కోట్ల రూపాయల విలువైన 3 ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి. 310 కోట్ల రూపాయల విలువైన 4 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కావలసి ఉందని మంత్రి వివరించారు. దేశ వ్యాప్తంగా 7,500 కిలోమీటర్ల తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాల్లో సాగరమాల కార్యక్రమం కింద 5.5 లక్షల కోట్ల రూపాయలతో 800 ప్రాజెక్ట్‌లను గుర్తించినట్లు ఆయన తెలిపారు.