స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో జగన్ సర్కార్ కింకర్తవ్యం ఏంటి? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. మన దేశంలో కరోనా ప్రభావం చూపడం అప్పుడప్పుడే స్టార్ట్ చేసిన నేపథ్యంలో గత మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ అర్ధాంతరంగా వాయిదా వేశారు.
ఈ వాయిదా ప్రక్రియతో వివాదం మొదలైంది. ఆ తర్వాత ఎస్ఈసీ, జగన్ సర్కార్ పోటీలు పడి మరీ తప్పుల మీద తప్పులు చేస్తూ వస్తున్నాయి. వీళ్లిద్దరి గొడవ జనానికి విసుగు తెప్పిస్తోంది. రాష్ట్రంలో మరే సమస్య లేనట్టు , ఏదో ఒక అంశంపై ఈ రెండు వ్యవస్థల మధ్య హైకోర్టు లేక సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రొసీడింగ్స్ పంపారు. అయితే కరోనా సెకెండ్ వేవ్ వస్తుందన్న ఆందోళన నెలకున్న పరిస్థితుల్లో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని ఎస్ఈసీకి తెలిపింది. అలాగే ప్రొసీడింగ్స్ను నిలిపి వేయాలంటూ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్పై పలు దఫాలుగా విచారించిన హైకోర్టు తాజాగా బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆదేశించింది. అంతటితో ఆగలేదు, ఎస్ఈసీని ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారుల బృందం కలవాలని ఆదేశాల్లో పేర్కొంది.
కరోనా పరిస్థితులపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు తెలిపింది. ఎస్ఈసీతో అధికారుల బృందం చర్చించిన అంశాలను తెలపాలని, అనంతరం ఈనెల 29న తుది నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఎస్ఈసీని ముగ్గురు అధికారుల బృందం వెళ్లి కలవడమా? లేక సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడమా? అనే దానిపై ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడింది. అయితే నిమ్మగడ్డ వ్యవహారాలపై ఆగ్రహంగా ఉన్న జగన్ సర్కార్ ….హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఈసిని కలిసేందుకు ముగ్గురు అధికారుల బృందాన్ని పంపుతుందని ఎవరూ భావించడం లేదు.
ఏదో రకంగా ఈ కేసును నిమ్మగడ్డ రిటైర్డ్ కాలం (వచ్చే ఏడాది మార్చి నెలాఖరు) వరకూ నెగ్గుకు వచ్చేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఆ పదవిలో ఉన్నంత వరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థలకు వెళ్లకూడదని రాష్ట్ర ప్రభుత్వ భావనగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హైకోర్టు తాజా ఉత్వర్వులపై ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ వ్యూహం వెల్లడయ్యే అవకాశం ఉంది. అంత వరకూ ఉత్కంఠ తప్పేలా లేదు.