జగన్ ఢిల్లీ టూర్.. పచ్చ మీడియాకి చేతినిండా పని

జగన్ ఢిల్లీ వెళ్తున్నారంటే కట్టుకథలు, 'కమ్మ'ని పిట్ట కథలు చెప్పడానికి రెడీగా ఉంటాయి పచ్చ ఛానెళ్లు. ఆమధ్య అమిత్ షా ఆంతరంగిక సమావేశాన్ని కూడా విశ్లేషించి నవ్వులపాలయింది ఏబీఎన్. ఇప్పుడు కూడా వాటికి చేతినిండా…

జగన్ ఢిల్లీ వెళ్తున్నారంటే కట్టుకథలు, 'కమ్మ'ని పిట్ట కథలు చెప్పడానికి రెడీగా ఉంటాయి పచ్చ ఛానెళ్లు. ఆమధ్య అమిత్ షా ఆంతరంగిక సమావేశాన్ని కూడా విశ్లేషించి నవ్వులపాలయింది ఏబీఎన్. ఇప్పుడు కూడా వాటికి చేతినిండా పని దొరికింది. 

ఇటీవల జగన్ ఢిల్లీ టూర్ అంటూ బ్రేకింగ్ వేసి, ఆ తర్వాత అబ్బెబ్బే అపాయింట్ మెంట్ దొరకలేదంట అంటూ సెటైర్లు కూడా వేసింది సదరు పచ్చపాత మీడియా. అధికారికంగా ఖరారు కాని టూర్ ని కూడా సదరు ఛానెల్స్ తమకి అనుకూలంగా మార్చుకున్నాయి.

తాజాగా ఇప్పుడు జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. మధ్యాహ్నం ఆయన ఢిల్లీ వెళ్లి, సాయంత్రం హోం మంత్రి అమిత్ షా తో భేటీ అవుతారు. జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో కూడా ఆయన భేటీ కావాల్సి ఉంది. రక్షణ, ఆర్థిక మంత్రుల అపాయింట్ మెంట్ కూడా కోరే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

అసలేంటి మేటర్..?

జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఇటీవలే సీఎం జగన్, ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. 17వేలకు పైగా ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్ ఫీల్డ్ కాలనీలలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. దీనిపై మరోసారి ప్రత్యక్షంగా హోం మంత్రితో చర్చించే అవకాశం ఉంది. 

విభజన హామీలు, పెండింగ్ బకాయిలపై చర్చిస్తారని తెలుస్తోంది. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు వివరించడం లాంటివన్నీ మామూలు వ్యవహారాలే.

ఇక పోలవరం ప్రాజెక్ట్ నిధులు, నిర్మాణ పురోగతి వంటి వాటిపై గజేంద్ర సింగ్ షెకావత్ తో చర్చించే అవకాశముంది. పర్యావరణ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తో.. ఇటీవల రాష్ట్రంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై చర్చిస్తారని తెలుస్తోంది.

పచ్చబ్యాచ్ కి ఉన్న అవకాశాలేంటి..?

గతంలో జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. ఆయనకు తలంటారు, వీపు రుద్దారు, సోపు రాశారు అంటూ వ్యంగ్యంగా వార్తలు వండి వారుస్తుంటుంది బాబు అనుకూల మీడియా. ఏబీఎన్ కి మాత్రంత జగన్ ఢిల్లీ టూర్ మంచి విందు భోజనం లాంటిది. అందులో.. జగన్ అమిత్ షా ని కలిశారంటే ఇక ఆ ఛానెల్ లో చిలువలు, పలువలు చేసి రాయాల్సిందే. 

అందులోనూ ఇటీవలే రఘురామకృష్ణరాజు ఇష్యూ జరిగింది. ఆయన కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఇంకెందుకు ఆర్ఆర్ఆర్ ఎపిసోడ్ వల్లే జగన్ అత్యవసరంగా ఢిల్లీ వెళ్లారని, అమిత్ షా కి వివరణ ఇచ్చారంటూ చెప్పుకొస్తుంది. ఆల్రడీ అదే దిశగా రహస్య భేటీలంటూ తొందరపడి కూసేసింది ఏబీఎన్.

ప్రతిసారీ జగన్ ఢిల్లీ వెళ్తి వస్తుంటారని, అధికారికంగా మేటర్ ఇదీ అని ఎప్పుడూ చెప్పలేదని, ఆయన వెళ్లొచ్చిన తర్వాత సీఎం కార్యాలయం మీడియాకు వాట్సప్ సందేశాలు మాత్రమే ఇస్తుందంటూ సెటైర్లు వేస్తోంది. ఈ రెండ్రోజులు వీరి ఊహాగానాలకు కొదవే ఉండదు. చూసి ఎంజాయ్ చేసి, వదిలేయడమే.