దేవునికైనా దెబ్బే గురువు అన్నారు. ఇంత కాలానికి ‘వారాంతపు పలుకు’ సార్కు సరైన మొగుడు దొరికాడు. రూ.100 కోట్ల పరువు నష్ట దావాను ఎదుర్కొంటున్న ఎల్లో మీడియాధిపతి ఈ వారంతపు పలుకుల్లో దిక్కులు పిక్కటిల్లేలా ఆర్తనాధాలు చేశాడు. తనపై పరువు నష్టం కేసు వేసిన వ్యక్తని ఎవరని ప్రశ్నిస్తూ అక్షర ఆక్రోశం వెళ్లగక్కాడంటే ఆయన మైండో ఏ స్థాయిలో దెబ్బతిందో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వారం తన కొత్తపలుకులో సదరు ది గ్రేట్ జర్నలిస్ట్ అయిన సార్ లేవనెత్తిన ఆంశాలను చూస్తే నవ్వు రాక మానదు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి దెబ్బకు మానసికంగా ఎంతగా హింస అనుభవిస్తున్నాడో ఆయన రాతలే తెలియజేస్తున్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనతో పాటు ఆయన ప్రభుత్వంపై అసత్య, అసంబద్ధ కథనాలు వండివార్చేందుకు జర్నలిజంలో అరాచకాన్ని ప్రాక్టీస్ చేస్తున్న వారిలో సదరు మీడియాధిపతి అగ్రగణ్యుడనే అభిప్రాయాలున్నాయి.
ఇంత కాలం మీడియా ముసుగులో చంద్రబాబు ప్రయోజనాల కోసం , ప్రత్యర్థి పార్టీ నేతలపై ఇష్టానుసారం కథనాలు ప్రసారంతో పాటు ప్రచురిస్తూ ….తననెవరూ ఏమీ చేయలేరని విరవీగుతున్న ఎల్లో మీడియాధిపతి అహంకారాన్ని అణచివేసేందుకు ఇప్పుడు సుబ్రమణ్యస్వామి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడనే సామెత అక్షరాలా సుబ్రమణ్యస్వామి తాజా నిర్ణయంతో నిజమైందని తెలుగు సమాజం చర్చించుకుంటోంది.
తన పత్రికలో రాసిన అసత్య కథనంపై వివరణ ఇవ్వకుండా ….అసలు సుబ్రమణ్యస్వామి తనపై కేసు వేయడానికి ఎవరని సదరు అరాచక జర్నలిస్ట్ కమ్ మీడియాధిపతి ప్రశ్నిస్తుండడం గమనార్హం. వారాంతపు పలుకు సార్ సంధిస్తున్న ప్రశ్నలేంటంటే…
‘సుబ్రమణ్యస్వామి ఏ హోదాలో పరువునష్టం దావా వేస్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ దావా వేయడానికి ఆయన న్యాయవాది కూడా కారే! న్యాయశాస్త్రంలో ఆయనకు డిగ్రీ కూడా లేదు. దేశంలోని ఏ బార్ అసోసియేషన్లో కూడా ఆయన సభ్యుడు కాదు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాపై కేసు వేసే హక్కు ఉంది. అయితే ఇందులో సుబ్రమణ్య స్వామి పాత్ర ఏమిటి? ఎవరో దాఖలు చేసిన కేసులో న్యాయవాది కాని వారు వాదించడానికి కోర్టు అనుమతించదు.
ఆయన వ్యక్తిగత హోదాలో కేసు దాఖలు చేయడానికి కూడా లేదు. అదే అంశంపై టీటీడీ అప్పటికే కేసు దాఖలు చేసినందున మరో కేసు వేయడానికి థర్డ్ పార్టీకి అవకాశం ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, సొంతంగా కేసు వేసే పక్షంలో టీటీడీకి వంద కోట్లు కట్టాలని అడగడానికి నువ్వు ఎవరు? ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రావడానికి అయిన ఖర్చును సుబ్రమణ్య స్వామి స్వంతంగా పెట్టుకున్నారా లేక తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టుకుందా? లేక జగన్రెడ్డి సదరు విమానాన్ని ఏర్పాటు చేశారా? స్వామి అండ్ కోకు టీటీడీ ఎంత ఫీజు చెల్లించబోతున్నదన్నది?’
ఎంతసేపూ తనపై పరువు నష్టం వేయడానికి సుబ్రమణ్యస్వామి ఎలా అర్హుడు కాదో మీడియాధిపతి పదేపదే చెప్పడానికి ప్రయత్నించడాన్ని చూడొచ్చు. ఇంకా వారాంతపు పలుకు సార్కు తెలియాల్సిన అంశాలు చాలా ఉన్నాయట. సుబ్రమణ్యస్వామి లాయర్ల ఫీజులు, ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి వచ్చేందుకు అయిన ఖర్చులు వివరాలు కూడా అడ్జెంట్గా తెలియాల్సిన అవసరం ఉందట! వ్యాసంలోని ఈ చిలిపి సందేహాలు వ్యక్తం చేయడం, వివరాలు కావాలని మీడియాధిపతి కోరడాన్ని చూస్తే … చిన్న పిల్లల చేష్టలు గుర్తురాక మానవు. తాను మాత్రం ఎవరికీ బాధ్యత వహించడు కానీ, ఇతరులు మాత్రం అన్నీ బాధ్యతగా చేయాలని వారాంతపు పలుకుల సార్ డిమాండ్ చేయడం విడ్డూరం కాక మరేంటి?
సుబ్రమణ్యస్వామి కేసులో తానెంతగా భయపడుతున్నాడో ఆయన రాసిన ప్రతి అక్షరం ప్రతిబింబిస్తోంది. అందువల్లే సుబ్రమణ్యస్వామి కేంద్రంగా సాగిన ఈ వారాంతపు పలుకులు తడబడ్డాయి. తానెవరికీ భయపడనని చెప్పే ప్రయత్నంలో గాంభీర్యాన్ని ప్రదర్శించాలని చూసినా …అక్షరం మాత్రం గతి తప్పి మీడియాధిపతి మతి పోయిందనే వాస్తవాన్ని సాక్ష్యాత్కరించింది. ఇందుకు ఈ రాతలే నిదర్శనం.
‘తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితపై అవినీతి ఆరోపణలు చేస్తూ దాఖలు చేసిన కేసుతో పాటు 2జి కేసు ద్వారా ఆయనకు దేశవ్యాప్తంగా పేరొచ్చింది. లిటిగెంట్ పొలిటీషియన్గా పేరొందిన సుబ్రమణ్య స్వామి జోలికి వెళ్లడానికి చాలా మంది జంకుతూ ఉండవచ్చు. మాకు అలా జంకాల్సిన అవసరం లేదు’
అవినీతి కేసులో నిన్నమొన్నటి వరకూ జైల్లో ఉన్న శశికళకు ఆ గతి సుబ్రమణ్యస్వామి న్యాయపోరాటం వల్లే పట్టిందనే విషయం సదరు ఎల్లో మీడియాధిపతికి బాగా తెలుసు. అందుకే ఇప్పుడు ఈ భయం, ఆందోళన. అలాగే ఈ వ్యాసంలో రాయని అంశం మరొకటి ఉంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో నేటికీ న్యాయస్థానాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారంటే, దానికి కారణం కూడా సుబ్రమణ్యస్వామినే.
స్వామి న్యాయపోరాటాలకున్న పవర్ ఏంటో తెలిసే ఎల్లో మీడియాధిపతి ఆర్తనాధాలు చేస్తున్నారు. రాజ్యసభ సీటు కోసమే తనపై పరువు నష్టం కేసు వేశారనే కొత్త పల్లవి ఎత్తుకున్నాడు. లిటిగెంట్ పొలిటీషన్గా పేరొందిన సుబ్రమణ్యస్వామి అంటే తాను భయపడనని చెబుతూనే, మరోవైపు ఈ వారం ఆయన గురించే వ్యాసం రాయడంలోనే ఆయనంటే ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.