మహానేత 12వ వర్ధంతి నేడు

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజా సేవలో అమరుడై నేటికి పన్నెండేళ్లు! ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకొని వాటికి పరిష్కారాలను రూపొందించాడానికి తనకు తానే ఏర్పాటుచేసుకున్న రచ్చబండ కార్యక్రమానికి వెల్తూ కుట్రపూర్తితంగానో,…

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజా సేవలో అమరుడై నేటికి పన్నెండేళ్లు! ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకొని వాటికి పరిష్కారాలను రూపొందించాడానికి తనకు తానే ఏర్పాటుచేసుకున్న రచ్చబండ కార్యక్రమానికి వెల్తూ కుట్రపూర్తితంగానో, ప్రమాదవశాత్తో రాష్ట్ర ప్రజల సంక్షేమ సౌభాగ్యాల కోసం తన ప్రాణాలర్పించిన మహనీయుడు డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారు చిరస్మరణీయులు! 

మంచితనానికి, రాజనీతిజ్ఞతకి, పరిపాలనాదక్షతకి, దయాద్రహృదయానికి మారుపేరైన ఆయనకి నిజానికి మరణం లేదు, ఆయనని అభిమానించే కోట్ల గుండెల్లో కలకాలం కొలువై ఉంటారు. చిన్నతనం నుండీ చేతికి ఎముకే లేని దయాగుణం ఆయన సొంతం. గుల్బర్గాలో మెడిసిన్ చదివి, కేవలం రూపాయే ఫీజ్ వసూలు చేస్తూ పుట్టిన గడ్డమీద వైద్యం చేసి పేదల డాక్టరుగా ఎనలేని సేవలందించారు.

డాక్టరుగా చేసే ప్రజాసేవ కంటే విధివిధానాలని మారుస్తూ శాసనాలు చేసే అధికారముంటే ఇంకా ఎక్కువగా పేద ప్రజలకి సేవ చెయ్యొచ్చని తలచి 1978లో మొదటిసారి పులివెందుల నుండి గెలిచి ఎమ్మెల్లే అయిన రోజు నుండి ఓటమి ఎరగని రాజకీయ దురంధరుడు వైఎస్సార్. తన ముప్పై ఏల్ల రాజకీయ జీవితంలో అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన తన ప్రజాపోరాటాలతో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిత్యం ప్రజల మధ్య ఉండి వారి మనసులలో కొలువై ఉన్నారు. 

మరణించిన పన్నెండేళ్లకు కూడా ప్రజాహృదయాల్లో కొలువై ఉన్నారంటే ఆయనంటే ప్రజలకున్న ప్రేమాభిమానాలేపాటివో అర్ధమవుతున్నది. ఉద్యమాలే ఊపిరిగా జనం కోసం అహరహం శ్రమించి. జనం కోసమే అనుక్షణం పరితపించిన మహానేత డాక్టర్ వైఎస్సార్. 2003 వేసవి మండుటెండల్లో ఆయన చేసిన 1500 కిలోమీటర్ల పాదయాత్ర ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వానికి, పట్టుదలకి అద్దం పట్టి తర్వాత కాలంలో ఇతర నాయకులకి ఒక కొలబద్ద అయింది.

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటేనే ఒక విలక్షమైన వ్యక్తిత్వం గుర్తుకొస్తుంది, మాట తప్పని మడమ తిప్పని ఒక మేరునగధీరుడిని గుర్తుకు తెస్తారు. ఎంత గంభీరమైన ప్రతికూల వాతావరణంలో కూడా స్వచ్ఛమైన చిరునవ్వులు చిందించే ఒక ధైర్యవంతుడిని గుర్తుకు తెస్తారు. ఆయన మాకండగా ఉండగా మాకేమి కాదనే ధైర్యాన్ని సమాన్య ప్రజల్లో నింపిన ఒక మనసున్న మహారాజుని గుర్తుకు తెస్తారు. పారే ఒక నదిని,, నింపాదిగా నడిచే ఒక రారాజుని గుర్తుకు తెస్తారు. 

తెల్లని పంచకట్టులో తెలుగుతనానికి చిహ్నంలా గుర్తుకొస్తారు. రైతులకి వ్యవసాయాన్ని దండగ నుండి పండగ చేసిన ఒక రైతుభాందవుడిని, జలయజ్ఞప్రధాతని గుర్తుకుతెస్తారు! ఆరోగ్యశ్రీతో బీదా బిక్కికి కార్పోరేటు వైద్యాన్ని చేయించిన ఒక ప్రాణ ప్రధాతని గుర్తుకు తెస్తారు! రెండు సార్లూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయన భార్య విజయమ్మ గారిని ప్రక్కనే కూర్చుండపెట్టుకున్న కుటుంబ మనిషిగా గుర్తుకొస్తారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చెయ్యని అరుదైన సంఘటన ఇది.

రాజకీయాల్లోగాని, బయటగాని డాక్టర్ వైఎస్సార్ అపూర్వమైన మనస్తత్వాన్ని కలిగినవారు. నమ్ముకున్నవాల్ల కోసం, నమ్మినవాల్ల కోసం ఎందాకైనా పోగలిగిన మహామనిషి. వర్తమాన రాజకీయాల్లో ఆయనకి సరిలేరెవ్వరు, భవిష్యత్తులో మల్లీ ఆయనకి సరితూగగలిగే నాయకుడు కనిపిస్తారనుకోవడం ఒక కలే. 2004 నుండి 2009 వరకు నాయకత్వంలో దేశం మొత్తం మీద ఆయన దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఆయనకి ముందుగాని ఆయన తర్వాతగాని రాజనీతిగ్ణతలో ఆయనతో పోల్చగలిగే వాల్లు ఎవరూ లేరు, ఉండరు. 

ఆయన అకాల మరణం తెలుగు రాష్ట్రాలకు ఐదుగురు ముఖ్యమంత్రులను ఇచ్చింది గాని ఆయనే బతికుంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప మిగిలిన నలుగురూ చరిత్రపుటల్లో నిక్షిప్తమయ్యేవారనేది అక్షరాలా నిజం. ప్రజాశ్రేయస్సే ఊపిరిగా బతికిన ఒక మహానేత, ఒక రాజనీతిజ్ఞుడు, ఒక ప్రజామనిషి, ఒక రైతు, ఒక వైద్యుడు, ఒక సోదరుడు, ఒక చిన్నాన్న, ఒక తాత కలగలిసిన గొప్ప మానవతావాదిగా డాక్టర్ వైఎస్సార్ సాక్షాత్కరిస్తాడు. జన మన హృదయాలలో మకుటంలేని రాజన్నకి ఒక నాయకుడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా ఎల్లప్పటికీ చోటుంటుంది!

రాజశేఖరుడిలా 60 ఏళ్ళు బతికితే చాలు ఏ జీవితానికైనా కాకిలా కలకాలం బతికేకన్నా!

జోహార్ వైఎస్సార్! అమర్ రహే మహానేతా!

గురవా రెడ్డి, అట్లాంటా