ఏబీవీకి చంద్ర‌బాబు స‌ర్కార్ గిఫ్ట్‌

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు చంద్ర‌బాబు స‌ర్కార్ గిఫ్ట్ ఇచ్చింది. ఆయ‌న‌పై మూడు కేసులుండ‌గా, రెండింటిని మూసివేస్తూ బాబు సర్కార్ ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. అస్మ‌దీయ ఐపీఎస్ అధికారుల‌పై కేసుల‌ను ఎత్తివేయ‌డం, త‌స్మ‌దీయ…

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు చంద్ర‌బాబు స‌ర్కార్ గిఫ్ట్ ఇచ్చింది. ఆయ‌న‌పై మూడు కేసులుండ‌గా, రెండింటిని మూసివేస్తూ బాబు సర్కార్ ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. అస్మ‌దీయ ఐపీఎస్ అధికారుల‌పై కేసుల‌ను ఎత్తివేయ‌డం, త‌స్మ‌దీయ ఐపీఎస్‌ల‌పై కేసులు పెట్టి వేధించ‌డం.. ఇదీ మంచి ప్ర‌భుత్వ పాల‌సీగా ఉంద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రెడ్‌బుక్ పాల‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో త‌మ‌కు గిట్ట‌ని అధికారులు, అలాగే ప్ర‌త్య‌ర్థుల‌పై కేసుల న‌మోదుకు కూట‌మి ప్ర‌భుత్వం ఏ మాత్రం వెనుకాడ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన నాలుగు నెల‌ల‌కు …బాబు హ‌యాంలో నిఘా చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించి ప్ర‌త్య‌ర్థులను పార్టీ ఫిరాయించ‌డంలో కీల‌క పాత్ర పోషించార‌ని ఏబీవీపై అభియోగాలున్నాయి. ఏబీవీ నిఘా ముఖ్య అధికారిగా చేయ‌కూడ‌ని ప‌నులు చేశార‌ని వైసీపీ హ‌యాంలో కేసులు న‌మోద‌య్యాయి.

ముఖ్యంగా ఇజ్రాయెల్‌ నుంచి నిఘా పరికరాల కొనుగోళ్ల కోసం ఆకాశ్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ అనే సంస్థకు 2018 అక్టోబరు 31న రూ.35 లక్షలు చెల్లించినట్లు ఏబీవీపై వైసీపీ ప్రభుత్వం అభియోగాలు మోపింది. ఏసీబీ విచారణకు ఆదేశించింది. త‌న కుమారుడి సంస్థ‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు క‌లిగించేందుకు ఏబీవీ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌ని గ‌త ప్ర‌భుత్వం ఆయ‌న్ను కేసుల‌తో వెంటాడింది. అలాగే ఫోన్ ట్యాపింగ్ సంగ‌తి సరేస‌రి.

త‌న కేసుల గురించి స‌ర్వీస్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మీడియాతో మాట్లాడారని ఏబీవీపై మ‌రోసారి చ‌ర్య‌లు తీసుకుంది. ఇందుకోసం గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన రెండు చార్జి మెమోలను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించడం గ‌మ‌నార్హం. గత ప్రభుత్వం విచారణ అధికారిని నియమించకుండా కాలయాపన చేయ‌డం, వాటిని జారీచేసి ఏడాదైనా ఆ ఉత్వర్వులు ఉప‌యోగం లేకుండా పోయాయి. దీంతో చార్జిమెమోలను చంద్ర‌బాబు స‌ర్కార్ ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు ఇచ్చింది. మ‌రో కేసుకు సంబంధించి ఫైల్‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప‌రిశీలిస్తున్నారు.

ఇదంతా ఏబీవీ విన్న‌పం మేర‌కే ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌చారం చేయ‌డం విశేషం. గ‌త ప్ర‌భుత్వం న‌మోదు చేసిన‌ త‌ప్పుడు కేసుల నుంచి విముక్తి క‌ల్పించాల‌ని కూట‌మి స‌ర్కార్‌కు ఏబీవీ విన్నవించుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న కేసుల ఫైళ్లు ముందుకు క‌దిలాయి. ఏబీవీ కోరుకున్న‌ట్టే కేసుల‌న్నీ హుష్ కాకి అన్న‌ట్టుగా త‌యారైంది.

మ‌రోవైపు వైసీపీ అనుకూల ఐపీఎస్‌ల‌పై చంద్ర‌బాబు స‌ర్కార్ కేసుల పేరుతో వేట సాగిస్తోంది. ముంబ‌య్‌కి చెందిన న‌టి కాదంబ‌రీ జెత్వానీపై అక్ర‌మ కేసు పెట్టారంటూ ముగ్గురు ఐపీఎస్ అధికారుల‌పై కేసులు న‌మోదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జ‌గ‌న్ హ‌యాంలో నిఘా అధికారి పీఎస్ఆర్ ఆంజ‌నేయులు, విజ‌య‌వాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, మ‌రో ఐపీఎస్ అధికారి విశాల్‌గున్నీల‌పై కేసులు న‌మోదు చేసి ముప్పుతిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. వీళ్ల‌పై సీఐడీ విచార‌ణ‌కు రెండు రోజుల క్రితం ప్ర‌భుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది.

త‌ప్పొప్పుల‌తో సంబంధం వుండ‌ద‌ని ఈ ప‌రిణామాలు చెబుతున్నాయి. త‌మ‌కు న‌చ్చ‌లేదంటే ఏదో ఒక కేసులో ఇరికించి భ‌య‌పెట్ట‌డం పాల‌కుల ప‌నైంది. ప్ర‌జ‌లు త‌మ‌కు అధికారం ఇచ్చింది… ప్ర‌తీకారాలు తీర్చుకోడానికే అని ప‌దేప‌దే నిరూపిస్తున్నారు. గ‌త ప‌దేళ్లుగా ఇలాంటి అవాంఛ‌నీయ ప‌రిణామాలు శ్రుతిమించాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

8 Replies to “ఏబీవీకి చంద్ర‌బాబు స‌ర్కార్ గిఫ్ట్‌”

Comments are closed.