ఛీఛీ…ఏందీ పాడుప‌ని!

సోష‌ల్ మీడియాలో అగంత‌కులు ఛీత్క‌రించుకునే ప‌నికి తెగ‌బ‌డ్డారు. ఒక సామాజిక వ‌ర్గం మ‌హిళ‌ల ఫొటోల‌ను సోష‌ల్ మీడియా నుంచి సేక‌రించి, వేలం జాబితాలో చేర్చ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఒక మైనార్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన…

సోష‌ల్ మీడియాలో అగంత‌కులు ఛీత్క‌రించుకునే ప‌నికి తెగ‌బ‌డ్డారు. ఒక సామాజిక వ‌ర్గం మ‌హిళ‌ల ఫొటోల‌ను సోష‌ల్ మీడియా నుంచి సేక‌రించి, వేలం జాబితాలో చేర్చ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఒక మైనార్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌ల టార్గెట్‌గా ఈ చ‌ర్య ఉండ‌డం గ‌మ‌నార్హం. దీనిపై దేశ వ్యాప్తంగా మ‌హిళా సంఘాలు, ప్ర‌జాసంఘాలు, ప‌లు రాజ‌కీయ ప‌క్షాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

ఓ ఆగంతుకుడు ‘బుల్లీబాయ్‌’ పేరుతో రూపొందించిన బ్లాగ్‌/యాప్ లో మైనార్టీ మహిళల ఫొటోలను అమ్మ‌కానికి పెట్టాడు. ఇలా వందల సంఖ్యలో అంద‌మైన మ‌హిళ‌ల‌ ఫొటోలు ఆ యాప్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాయి. ‘బుల్లీబాయ్‌ ఆఫ్‌ ది డే’ పేరుతో రోజుకొక మహిళ ఫొటోను వేలం జాబితాలో ప్రముఖంగా పెట్టాడు.

సోష‌ల్ మీడియాలో వికృత పోక‌డ‌ల‌ను గుర్తించిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని ట్విటర్‌లో పేర్కొంటూ.. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ మంత్రి అశ్వినీవైష్ణవ్‌కు ట్యాగ్‌ చేశారు. మ‌రోవైపు ఇదే విష‌య‌మై ఢిల్లీకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు తాను కూడా బాధితురాలినే అంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. తన ఫొటోను బుల్లీబాయ్‌ యాప్‌లో అమ్మకానికి పెట్టారంటూ ఫిర్యాదు చేశారు.

ఈమె ఫిర్యాదుపై ఢిల్లీ సైబర్‌క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ అంశంపై జాతీయ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు సీరియస్‌ అయ్యారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. ఈ యాప్‌పై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి అశ్వినీవైష్ణవ్‌ భారత సైబర్‌ సెక్యూరిటీ సంస్థ(సెర్ట్‌-ఇండియా)ను ఆదేశించారు. సెర్ట్‌ ఇండియా వెంటనే యాప్‌ హోస్టింగ్‌ సంస్థ గిట్‌హబ్‌ను సంప్రదించి.. ఆ యూజర్‌ను బ్లాక్‌ చేయించింది.

దీనిపై కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్‌గాంధీ, ఎంఐఎం అధ్య‌క్షుడు అస‌దుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ఓ వ‌ర్గం మ‌హిళ‌ల‌ను అవ‌మానించే ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌ను అడ్డుకోవాలంటే మ‌నమంతా ఒక్క‌టై పోరాడాల‌ని ఆయ‌న ట్విట‌ర్ వేదిక‌గా పిలుపు నిచ్చారు. నేర‌స్తుల‌కు శిక్ష‌లు ప‌డ‌క‌పోవ‌డం వ‌ల్లే వారు రెచ్చిపోయి ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని అస‌దుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.