దారుణం.. శవంగా తేలిన కాకినాడ చిన్నారి

దారుణం జరిగిపోయింది.. మూడు రోజులుగా ఆచూకి దొరకని కాకినాడకు చెందిన ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ శవంగా తేలింది. నిన్నటివరకు ఈ చిన్నారిపై కొంచెమైనా ఆశ ఉండేది. ఎప్పుడైతే తనే చిన్నారి చంపేసి ఉప్పుటేరులో పడేశానని…

దారుణం జరిగిపోయింది.. మూడు రోజులుగా ఆచూకి దొరకని కాకినాడకు చెందిన ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ శవంగా తేలింది. నిన్నటివరకు ఈ చిన్నారిపై కొంచెమైనా ఆశ ఉండేది. ఎప్పుడైతే తనే చిన్నారి చంపేసి ఉప్పుటేరులో పడేశానని సవతి తల్లి నేరం అంగీకరించిందో, అప్పుడే అందరి ఆశలు అడియాశలయ్యాయి. ధర్మాడి సత్యం బృందం చిన్నారి మృతిదేహాన్ని వెలికితీసింది.

జగన్నాధపురంలోని స్కూల్ నుంచి దీప్తిశ్రీని, సవతి తల్లి శాంతికుమారి ఇంటికి తీసుకెళ్లింది. తువ్వాలును గొంతుకు బిగించి హత్య చేసింది. తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి, షేరింగ్ ఆటో ఎక్కి, ఇంద్రపాలెం వంతెన వద్ద ఉప్పుటేరులో మూటను పడేసింది.

శాంతికుమారికి కొడుకు పుట్టాడు. దీంతో దీప్తిశ్రీని అడ్డుతొలిగించుకునేందుకు ఈ ఘాతుకానికి పాల్పడింది. మొదటి భార్య కూతురిపై తన భర్త ఎక్కువ ప్రేమ చూపించడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. శాంతికుమారి వ్యవహారశైలి నచ్చక, ఆ తండ్రి దీప్తిశ్రీని ఇంటికి దూరంగా, అమ్మమ్మ ఇంటి వద్ద పెంచుతున్నాడు. ఖర్చుల కోసం నెలకు 8వేల రూపాయలు పంపిస్తున్నాడు.

ఇవేవీ శాంతికుమారికి నచ్చలేదు. చిన్నారిపై అంతులేని ద్వేషం పెంచుకుంది. ఎలాగైనా దీప్తిశ్రీని అడ్డుతొలిగించుకోవాలని చూసింది. పసిపిల్ల అని కూడా చూడకుండా, తన చేతులతో దీప్తిశ్రీని కడతేర్చింది. శాంతికుమారిపై కిడ్నాప్, హత్యా నేరాలు  నమోదు చేసి, ఆమెను రిమాండ్ కు తరలించారు.